ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు విషయం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందంటూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది. రాజ్యాంగంలోని 214 నిబంధనతో పాటు 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు మరియు ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఉమ్మడి హైకోర్టుతో సంప్రదించిన తర్వాతే పునర్విజన చట్ట ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటుచేసినట్టు కేంద్రమంత్రి తెలిపారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని కేంద్రం తెలిపింది. మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి నగరం డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందన్నారు కేంద్ర మంత్రి.
మరి కేంద్ర ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా రియాక్ట్ అవుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇప్పటికే పోలవరం ఎత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు హైకోర్టు తరలింపుపైనా తన అభిప్రాయాన్ని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..