TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ విషయం తెలియకుండా వెళ్తే.. దర్శనం కష్టమే!
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేశస్థానం కీలక సూచనలు చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో 9 రోజుల పాటు ఈ ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని గుర్తించి భక్తులకు అధికారులకు సహకరించాలని టీటీడీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేశస్థానం కీలక సూచనలు చేసింది. తిరుమల క్షేత్రంలో త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వేగవంతమైన సర్వదర్శనం కల్పించడమే లక్ష్యంగా పలు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
9 రోజుల పాటు రద్దయ్యే సేవలు ఇవే
టీటీడీ ప్రకటన ప్రకారం.. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. దీని వల్ల దర్శనానికి ఆలస్యం అవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొంది. భక్తులందరూ ఈ విషయాలను గమనించి, అధికారులకు సహకరించాలని టీటీడీ కోరింది.
టీటీడీలో శ్రీవారి వస్త్రాల వేలం
ఇదిలా ఉండగా భక్తులకు టీటీడీ మరో ప్రకటన కూడా చేసింది. ఆగస్టు 17 నుంచి 19 వరకు టీటీడీలో వస్త్రాల ఈ-వేలం జరగనున్నట్టు తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 17 నుంచి 19 వరకు ఈ-వేలం ద్వారా వేలం వేయనున్నట్టు పేర్కొంది. ఈ వేలంలో 177 లాట్లలో కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
వేలంలో విక్రయించే వస్త్రాలు
టర్కీ టవళ్లు, ఆర్డినరీ టవళ్లు, లుంగీలు, శాలువాలు, బెడ్షీట్లు, దిండుకవర్లు, న్యాప్కిన్లు, హ్యాండ్కర్చీఫ్లు, పిల్లో కవర్లు, బ్లౌజ్పీస్లు, దుపట్టాలు, పరదాలు, హుండీ గలీబులు, ఈర్వాడాలు తదితర వస్త్రాలను ఈ-వేలంలో విక్రయించనున్నట్టు తెలిపింది. ఈ వేలంలో పాల్గొనాలి అనుకునే భక్తులు వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం 0877-2264429ను సంప్రదించవచ్చని. అలాగే www.konugolu.ap.gov.in, www.tirumala.org వెబ్సైట్లలో వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
