Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీ, నెయ్యి సరఫరా విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న రూల్స్‌లో మార్పులు చేసింది. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..
Tirumala

Updated on: Feb 18, 2026 | 8:29 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణల క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ తయారీ, నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. లడ్డూ, నెయ్యి నాణ్యతను నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించడం, నెయ్యి సరఫరా కంపెనీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం, టెండర్లలో పారదర్శకత వంటి నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి భక్తులకు నాణ్యమైన లడ్డూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

కొత్త నిబంధనలు ఇవే..

-నెయ్యి సరఫరా సమయంలో నాణ్యత తగ్గకుండా చర్యలు
-సరఫరా కంపెనీలు ఎఫ్‌ఎస్ఎస్‌ఎఐ, ఎన్‌డీడీబీ నిబంధనలకు అనుగుణంగా అన్ని టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది
-ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో ఎన్‌డీడీబీ నిర్ణయించిన ధరల ప్రకారం కొనుగోలు
– డెయిరీ కంపెనీలకు టెండర్ల కేటాయింపుల్లో పారదర్శకత
-టీటీడీకీ నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్
-డెయిరీ ప్రాసెసర్ల తయారీ సిద్దతను అంచనా వేసేందుకు ఎంఆర్‌ఎల్ స్కోర్ విధానం
-మిల్ ఫ్యాట్ ప్యూరిటీ టెస్టులు, సెన్సరీ పారామీటర్స్, ఎఫ్‌ఎస్ఎస్ఆర్‌ నిబంధనలు మరింత కఠినతరం
-1500 కిలోమీటర్ల నెయ్యి సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గింపు

ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలు

ప్రస్తుతం టీటీడీకి మదర్ డెయిరీ, ఇందాపూర్ డెయిరీ, సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు టీటీడీ సిద్దమైంది. 2024-25 మధ్య నిర్వహించిన టెండర్లలో ఆ కంపెనీలు అర్హత సాధించాయి. ఏడు విడతలుగా టెండర్లు నిర్వహించగా.. నాలుగు టెండర్లు నందిని, మదర్ డెయిరీ రెండు, సంగం డెయిరీ ఒక టెండర్లు దక్కించుకున్నాయి.  నందిని డెయిరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది. కమిషన్ల కోసం నెయ్యి సరఫరాకు రేటు పెంచామనే వార్తల్లో నిజం లేదని,  ఆవు నెయ్యి హోల్‌సేల్ మార్కెట్లో ధరలను బట్టి చెల్లిస్తున్నట్లు తెలిపింది. 2016లో ఆవు పాల ధర రూ.17 నుండి రూ.20 మధ్య ఉండగా.. ఆవు నెయ్యి ధర రూ.278గా ఉండేది. ఇప్పుడు ఆవు పాల ధర రూ.42కు చేరుకుంది. దీంతోఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా రూ.658కు పెరిగాయి. శ్రీవారి లడ్డూల నాణ్యతకు తాము కట్టుబడి ఉన్నామని, తిరుమల పవిత్రతను రక్షించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Follow Us