Tirumala Tirupati: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు! ఏంటంటే?
శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించాలని నిర్ణయించుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొంది.

శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయించనున్నట్టు పేర్కోంది. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కుటుంబానికి నాలుగు టికెట్లు మాత్రమే
ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం నలుగురికి మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి అని టీటీడీ పేర్కోంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుందని తెలిపింది. ఈ నూతన విధానాన్ని నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.
అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. మూడు నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టం చేసింది. తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజూ భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుంది. అన్ని వర్గాల భక్తులను టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ దర్శన ప్రణాళికలను రూపొందిచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
