తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఇటీవల టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడలతో కలిసి టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మాట్లాడుతూ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.
సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు
• తిరుమలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గోకులం, ఏటీసీ, రామ్ భగీచా వంటి ప్రాంతాలను గుర్తించాలి.
• వివిధ వర్గాల భక్తులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలకు సూచిక బోర్డులను, నిర్ధిష్టమైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలి.
• తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు టీటీడీ నుండి అదనపు సిబ్బందిని కేటాయించాలి.
• తిరుమలలో భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయడం, మల్టీ లెవెల్ పార్కింగ్ లను నిర్మించాలి.
• నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.
• ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలి.
ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, అడిషనల్ ఎస్పీ ఐ.రామకృష్ణ, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, టీటీడీ, విజిలెన్స్, పోలీస్, ఆర్టీఏ, ఏపీఎస్ ఆర్టీసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..