TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఆ ట్రస్టు నిధులతో 3,615 ఆలయాల నిర్మాణం
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఈఓ ఈ మేరకు స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు 1500 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈఓ ధర్మారెడ్డి. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆలయాలను నిర్మించిందన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) ద్వారా 3,615 ఆలయాల నిర్మాణం, పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టినట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఈఓ ఈ మేరకు స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు 1500 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈఓ ధర్మారెడ్డి. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆలయాలను నిర్మించిందన్నారు. సమరసత సేవ ఫౌండేషన్ 320 ఆలయాల నిర్మాణం చేపట్టి 307 ఆలయాలను పూర్తి చేసిందన్నారు. అదే విధంగా గ్రామాల్లో స్థానికులు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ఈఓ ధర్మారెడ్డి.
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాల నిర్మాణం పలు నగరాల్లో జరిగిందన్నారు. సమరసత సేవ ఫౌండేషన్కు మరికొన్ని ఆలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఎస్సి, ఎస్టి కాలనీలు, కొండ ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీ చేశారన్నారు.
సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవిష్ణు. ఇందులో భాగంగా ఆలయాల నిర్వహణ చక్కగా జరుగుతోందని, భక్తులు ఎంతో సంతోషంగా ఆలయాలను దర్శించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో స్థానికులు విభేదాలను పక్కనపెట్టి కలసిమెలసి ఉంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైందన్నారు. ఇది ఎంతో సంతోషకరమన్నారు. నూతన ఆలయాలు, జీర్ణోద్ధరణ చేపట్టిన ఆలయాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వర్గానికి చెందినవారిని అర్చకులుగా నియమించినట్లు వెల్లడించారు. ఆయా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్టు నుండి ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమీక్షలో సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏవో బాలాజి, సిఏవో శేషశైలేంద్ర తోపాటు పలువురు టిటిడి అధికారులు పాల్గొన్నారు.
