
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయాందోళన గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో అని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని గుర్తించి ఎలాంటి ఆస్థినష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఏడాది పొదిలి పరిసర ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపం వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున భూమి కంపించడంతో చాలా మంది ప్రజలు గుర్తించలేకపోయారు. అప్పటికే నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీ బంకులు, హోటళ్లలో ఉన్నవారు భూ ప్రకంపనాలను గుర్తించారు. పొదిలి పట్టణంలో వరుస భూకంపాలతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో గత ఏడాది కాలంలో మూడుసార్లు భూమి కంపించింది. ఆ సమయంలో జనం ఇళ్ళల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. పొదిలి, ముండ్లమూరు, దర్శి మండలాల్లో రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించినట్టు గతంలో ప్రజలు గుర్తించారు. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఈ ఏడాది మే నెలలో వరుసగా మూడు రోజుల పాటు భూమి కంపించింది. దీంతో ఆ మూడు రోజులు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.
తాజాగా పొదిలిలో భూమి స్వల్పంగా కంపించడంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. తరచూ ఈ ప్రాంతాల్లోనే భూమి కంపించడంపై అధికారులు పరిశోధన చేపట్టాలని కోరుతున్నారు. అయితే గతంలో దర్శి ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనలపై అధికారులు పరిశోధనలు చేశారు. గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలోని భూముల్లో పొరలు సర్దుబాటు అవుతుంటాయి. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో భూమి లోపలి పొరలు సర్దుబాటు అయ్యే సమయంలో ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు తేల్చారు.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రకంపనాలు సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో జరుగుతుంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..