
ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి సోమవారం(26-05-25) ప్రవేశించాయని, రెండు లేదా మూడు రోజుల్లో ఏపీ అంతటా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. గత ఏడాది జూన్ 2న తాకగా ఈ సంవత్సరం ముందుగానే వచ్చాయని తెలిపారు. 2023లో జూన్ 11న, 2022లో జూన్ 13న, 2021లో జూన్ 4న, 2020లో జూన్ 4న, 2019లో జూన్ 20న రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వివరించారు.
రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో రాష్ట్రంలో మూడు రోజులపాటు చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
మంగళవారం(27-05-2025) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం(28-05-2025) శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం సాయంత్రం 5గంటల నాటికి అల్లూరి జిల్లా రాచపనుకులులో 56మిమీ, విజయనగరంలో 42.7మిమీ, మారేడుమిల్లిలో 41.5మిమీ, గంపరైలో34మిమీ, నెల్లిమర్లలో 33మిమీ, అన్నమయ్య జిల్లా ఎంగిలిబండ, కర్నూలు జిల్లా కామవరంలో31.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.