Perupalem Beach: తల్లితండ్రులకు కడుపు కోత మిగులుస్తున్న పేరుపాలెం బీచ్.. అండర్ వాటర్‌కరెంట్‌తో కొట్టుకుపోతున్న సందర్శకులు

| Edited By: Surya Kala

Nov 26, 2023 | 12:35 PM

బీచ్ లో నేరాల నియంత్రణ, పర్యాటకుల రక్షణకు సుమారు ఆరునెలల కిందట పోలీస్ అవుట్ పోస్టును ఆర్భాటంగా ఏర్పాటు చేసారు. అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. గత నెలలో ఆకనవారితోటకు చెందిన ఇద్దరు యువకులు బీచ్ లో మునిగి మృత్యువాతపడ్డారు. ఆ యువకుల వాహనం అపహరణకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ శాశ్వత సిబ్బందిని నియమించలేదు. పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించే, మొగల్తూరు పోలీస్టేషన్ సిబ్బందే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

Perupalem Beach: తల్లితండ్రులకు కడుపు కోత మిగులుస్తున్న పేరుపాలెం బీచ్.. అండర్ వాటర్‌కరెంట్‌తో కొట్టుకుపోతున్న సందర్శకులు
Perupalem Beach
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్ సుమారు 25 ఏళ్లుగా పర్యాటక కేంద్రంగా వినియోగంలోకి వచ్చింది. పేరుపాలెంసౌత్, కేపీపాలెం సౌత్ ల లోని బీచ్ ల్లో అప్పటి నుంచి సుమారు 300ల పైబడి పర్యాటకులు అలల ఉధృతికి లోనికి కొట్టుకు వెళ్లి మృత్యువాత పడినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. గత సెప్టెంబర్ నెలలో పేరుపాలెం బీచ్ లో సముద్ర స్నానాలు చేస్తూ ముగ్గురు యువకులు అలల ఉదృతికి లోనికి కొట్టుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. అక్టోబర్ నెల 22న చోటు చేసుకున్న ప్రమాదంలో మహిళ, యువకుడు మృతిచెందారు. మరో యువకుడి సముద్రంలోకి కొట్టుకువెళ్లి గల్లంతయ్యాడు. ఆ యువకుడి  ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ లో సముద్రపు అలలు లో అండర్ వాటర్ కరెంట్ ఉండడంతో స్నానాలకు దిగిన వారిని సముద్రం నీరు లాగేస్తుందని సముద్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పేరుపాలెంబీచ్ లో ప్రతి ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో పలుప్రాంతాల నుంచి వేలాదిగా పర్యాటకులు తరలివస్తుంటారు. వచ్చిన వారిలో అత్యధికులు సముద్రస్నానాలు చేసేందుకు ఆసక్తి కనబరిచి సముద్రంలోకి దిగుతుంటారు. అలా స్నానాలు చేస్తూ ప్రమాదవశాత్తు లోనికి కొట్టుకువెళ్లిన వారిని రక్షించేందుకు ఏ విధమైన ఏరాట్లు చేయలేదు. గత నెల 22న తణుకుకు చెందిన ఇద్దరు మృత్యువాత, మరో యువకుడు గల్లంతైన సంఘటనే దీనికి నిదర్శనం. సముద్ర అలల ప్రభావానికి ఐదుగురు వ్యక్తులు ప్రమాదం బారిన పడ్డారు. ఆ సమయంలో బీచ్ లో స్నానం చేస్తున్న వ్యక్తులు అలల ఉదృతిలో కొట్టుకువెళ్తున్న ఇద్దరు యువతులను ఒడ్డుకు చేర్చి రక్షించారు. మరో మహిళ, ఇద్దరు యువకులు తీరానికి సమాంతరంగా ఉన్న కొంత దూరం నీటివడికి కొట్టుకువెళ్లారు. ఆ సమయంలో ఒడ్డున ఉన్న వారి బంధువులు, స్థానికులు వారికి ఏ విధమైన సహాయం అందించే పరిస్థితి లేదు. కనీసం తాడు, కర్ర వంటి సాధనాలు కూడా అందుబాటులో లేవు. ఒడ్డున ఉన్న వారి ఆర్తనాదాలు తప్ప వారిని రక్షించలేని పరిస్థితి నెలకుంది.

రక్షణ సామగ్రి.. నిపుణులు ఉంటే

బీచ్ లో నేరాల నియంత్రణ, పర్యాటకుల రక్షణకు సుమారు ఆరునెలల కిందట పోలీస్ అవుట్ పోస్టును ఆర్భాటంగా ఏర్పాటు చేసారు. అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. గత నెలలో ఆకనవారితోటకు చెందిన ఇద్దరు యువకులు బీచ్ లో మునిగి మృత్యువాతపడ్డారు. ఆ యువకుల వాహనం అపహరణకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ శాశ్వత సిబ్బందిని నియమించలేదు. పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించే, మొగల్తూరు పోలీస్టేషన్ సిబ్బందే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, చాలినంత మంది సిబ్బంది లేకపోవడంతో మొగల్తూరు మండలంలోని సుమారు పది కిలోమీటర్ల తీరంలో ప్రజల రక్షణ మాకు సాధ్యం కాదని పోలీసులు చేతులెత్తేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రాంతంలో పర్యాటకుల రక్షణకు నిత్యం అందుబాటులో స్పీడు బోటు, గజ ఈతగాళ్లు అక్కడ భద్రతా విధులు నిర్వహించేవారికి లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలి. సముద్రంలో బారీ చెట్ల మొదళ్లను ఏర్పాటు చేసి వాటికి తాళ్లు అమరుస్తే కొట్టుకువెళ్లేవారిని గమనించిన సందర్భంలో వాటి సాయంతో రక్షించే అవకాశం ఉంటుంది. అవేమీ లేవు. పర్యాటకులు సముద్ర అలల్లోనికి దిగకుండా నిరోధిచేందుకు కార్తీకమాసంలోనే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో గాలికొదిలేస్తున్నారు.

బీచ్ కు వచ్చే పర్యాటకులు సముద్రపు అలలో స్నానం చేయకుండా నిరోధిస్తే ప్రాణనష్టం సంభవించడాన్ని అడ్డుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఐదేళ్ల కిందట పోలీసులు దాతల సాయంతో తీరం పొడవునా తాటి, కొబ్బరి చెట్ల మొదళ్లను నాటించి వాటికి ఇనుప కంచె ఏర్పాటు చేసి అనుమతి లేని ప్రాంతంలో పర్యాటకులు సముద్ర స్నానానికి దిగకుండా నిరోధించారు. దీని ప్రభావంతో రెండేళ్ల వరకూ ఒక్క మరణం కూడా సంభవించలేదు.

కార్తీక మాసంలో ఏర్పాట్లు లేమి

బీచ్ లో పర్యాటకుల రక్షణకు ఏవిధమైన ఏర్పాట్లు లేకపోవడం దారుణమని చెబుతున్నారు. గత నెల 22న బీచ్ లో కళ్లముందే సాటి మనుషులు అలల ఉధృతికి హాహాకారాలు చేస్తూ కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటం చాలా బాధనిపించింది. కనీసం తాడో, కర్రో అందుబాటులో ఉన్నా వారిని రక్షించేందుకు ఆస్కారం ఉండేది.

అయితే కార్తీక మాసం లో బీచ్ లో సురక్షిత ప్రదేశాలలో అనుమతించి మిగతా రోజులలో పోలీసు పహారా లేక పోవడమే ఏటా పదుల సంఖ్యలో మృత్యు వాత పడుతున్నారని ఇప్పటికైనా బీచ్ లో శాశ్వతంగా సిబ్బంది తో పాటు స్నానాలు చేసేందుకు సురక్షిత ప్రదేశాలు, స్పీడ్ బొట్లు గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..