
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్య వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన నంద్యాల సోన, కర్నూలు సోనా రకాల బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత మూడు నెలల క్రితం నంద్యాల సోన 50 కేజీల బియ్యం ప్యాకెట్ ధర రూ. 2,600 ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ. 3,800కి పెరిగింది.
అలాగే కర్నూలు సోనా బియ్యం ధర మూడు నెలల క్రితం రూ. 2,400 ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో రూ. 3,500కి చేరింది. ముఖ్యంగా గత పది రోజులుగా బియ్యం ధరలు భారీగా పెరుగుతుండగా, కేవలం ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే 50 కేజీల బస్తాపై సుమారు రూ. 500 వరకు ధర పెరగడం గమనార్హం.అయితే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఎల్నీనో ఎఫెక్ట్తో ఉత్పత్తి తగ్గమే అంటున్నారు వ్యాపారులు.
అవును ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి పంట సాగు తీవ్రంగా పడిపోయిందని.. సాగు లేకపోవడంతో మార్కెట్లో వచ్చే వడ్ల శాతం తగ్గి బియ్యం కొరత ఏర్పడిందని.. దీనికి తోడు మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరగడతో ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.