Andhra Pradesh: ఎవడ్రా నువ్.. ఇలా ఉన్నావ్.. ఏకంగా రైళ్లన్నీ ఆగిపోయాయి.. అసలేం జరిగిందంటే..?

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున హైడ్రామా కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ ప్రయాణికుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వేలాడుతూ, రైలు బోగీలపై పరుగులు తీస్తూ వీరంగం సృష్టించాడు. హైటెన్షన్ వైర్లతో అధికారులు తీవ్ర భయాందోళనకు గురికావడంతో పాటు ఏకంగా రెండున్నర గంటల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎట్టకేలకు రెస్క్యూ సిబ్బంది వల పన్ని అతడిని ఎలా కాపాడారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఎవడ్రా నువ్.. ఇలా ఉన్నావ్.. ఏకంగా రైళ్లన్నీ ఆగిపోయాయి.. అసలేం జరిగిందంటే..?
Man Clings To Overbridge In Renigunta Railway Station

Edited By:

Updated on: Sep 18, 2026 | 12:14 PM

తిరుపతి జిల్లాలోని ప్రముఖ రైల్వే జంక్షన్ రేణిగుంటలో తీవ్ర కలకలం రేగింది. అస్సాంకు చెందిన ఓ ప్రయాణికుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేలాడుతూ చేసిన హంగామాతో రైల్వే అధికారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ హైడ్రామా కారణంగా దాదాపు రెండున్నర గంటల పాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి, తోటి ప్రయాణికులతో గొడవ పడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల సమయంలో రైలు రేణిగుంట స్టేషన్‌కు చేరుకోగానే అతడు క్రిందికి దిగిపోయాడు. అనంతరం 2వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైకెక్కి, అక్కడి నుంచి కిందకి వేలాడుతూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.

వంతెన కిందే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండటంతో ఘటనాస్థలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉదయం 5:00 గంటల నుంచి 7:30 గంటల వరకు తిరుపతి, రేణిగుంట మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు, పోలీసులు దాదాపు రెండు గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతను వినలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్‌పై రక్షణ నెట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి బ్రిడ్జి పైనుంచి రైలు పైకి దూకి పరుగులు తీయగా, రెస్క్యూ సిబ్బంది చాకచక్యంగా వెంబడించారు. రైలు పైనుంచి కిందకు జారిపడుతున్న సమయంలో సిబ్బంది వల సాయంతో అతడిని సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రెండున్నర గంటల శ్రమ అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. విచారణలో అతను తన పేరు, వివరాలు సరిగ్గా చెప్పకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను అధికారులు క్రమబద్ధీకరించారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us