
ప్రకాశం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మరో చారిత్రక శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో వెలసిన వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15వ శతాబ్దానికి చెందిన ఈ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం ప్రకారం, క్రీ.శ. 1521లో ఆలయ నిర్వహణ, ఉత్సవాలు, రోజువారీ కైంకర్యాలకు అవసరమైన నిధుల కోసం ఉదయగిరి రాజ్యంలోని పొదిలి సీమకు చెందిన గార్లదిన్నె, కట్టిరాళ్లగుంప అనే రెండు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనాలు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని పలు వైష్ణవ ఆలయాల్లో ఇవి వెలుగుచూస్తున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్య విస్తరణ, యుద్ధ విజయాలకు ప్రతీకగా దేవాలయాల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన భూములు, పట్టణాల వివరాలను ఈ శాసనాలు వెల్లడిస్తున్నాయి.
చరిత్రలో విశిష్ట స్థానం
భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు తన 20వ ఏట, క్రీ.శ. 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. 1529 అక్టోబరు 17 వరకు కొనసాగిన ఆయన పాలనలో సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. తెలుగు, కన్నడ ప్రజల ఆదరణ పొందిన రాయలు రాజ్యవిస్తరణ కోసం చేసిన యుద్ధాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన వేయించిన శాసనాలు ఇటీవల కాలంలో పలు ఆలయాల్లో విస్తృతంగా బయల్పడటం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.