
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగగా.. హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులపైనే దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గురవాం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కుప్పిలి ప్రవళిక అనారోగ్యంతో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆదివారం ఉదయం విజయనగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మొదట ఆసుపత్రి సిబ్బంది సాధారణ చికిత్స అందించినప్పటికీ సాయంత్రానికి ప్రవళిక పరిస్థితి ఒక్కసారిగా విషమించింది.
అయితే వెంటనే డాక్టర్కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు సిబ్బందిని కోరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల విలువైన సమయం వృథా అయిందని, అందువల్లే తమ పాప చనిపోయిందని బాధిత బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ఆసుపత్రిలోనే ఉన్నప్పటికీ సమయానికి స్పందించకపోవడం, అత్యవసర పరిస్థితిని పట్టించుకోకపోవడం కారణంగానే బాలిక మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పాప బతికే అవకాశాలు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యమే ప్రాణం తీసిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అయితే జరిగిన పరిస్థితి నేపథ్యంలో ప్రవళిక కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. అదే పరిస్థితిలో సంయమనం పాటించాల్సిన ఆసుపత్రి సిబ్బంది ప్రవళిక కుటుంబసభ్యులు పై దురుసుగా ప్రవర్తించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమై వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అందుపులోకి తెచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవళిక మృతి రాజాం మండలం గురవాం గ్రామాన్ని విషాదంలో ముంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.