
ప్రకాశం జిల్లా కోరిశెపాడు మండలం రాచపూడి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక భారీ వేప చెట్టులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు హడలెత్తిపోయారు. అసలే వేసవి కాలం… ఆపై చెట్టు చుట్టూ ఎండిపోయిన గడ్డి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చెట్టు పక్కనే ఇళ్లు ఉండటంతో ఎక్కడ తమ ఇళ్లకు మంటలు అంటుకుంటాయో అని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అద్దంకి ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఆఫీసర్ల సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రాచపూడి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. చెట్టు తగలబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేవలం అజాగ్రత్త వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా..? అని అధికారులు విచారిస్తున్నారు.
ఉగాది పచ్చడికి వేపపువ్వులు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే… ఆక్సిజన్ జనరేటర్లుగా ఉన్న వేపచెట్లకు ఇటీవల కొంతకాలంగా వైరస్లు సోకి ఎండిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియాను నిర్మూలించే ఔషధ గుణాలు కలిగిన వేపచెట్టుకు వైరస్ పీడ పట్టి ఏదో కీడు జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవతా వృక్షాలుగా భారతీయులు కొలిచే వేపచెట్లకు ఏమైంది. ఎందుకు ఇలా జరుగుతోంది. అన్న చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏదో పోయేకాలం వచ్చిందా..? అన్నట్టుగా ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..