
ఆధిపత్యం కోసం అడ్డుతొలగించుకున్నారు. పెత్తనం కావాలంటే ప్రత్యర్ధులు ఉండకూడదనుకున్నారు. కాపు కాసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన గ్రామ రాజకీయాల్లో హత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్య చేసిన వారిని గ్రామ బహిష్కరణ చేయాలంటూ బాధితులు గొంతెత్తి నినదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఆధిపత్యం కోసం గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. ఇందులో భాగంగానే హత్య జరగడం కలకలం రేపింది.
నారాకోడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య – రమేష్ కుటంబాల మధ్య ఎప్పటి నుండో విబేధాలున్నాయి. రమేష్ కుటుంబం టీడీపీలో ఉండగా గతంలో రమణయ్య కుటుంబం వైసీపీలో ఉండేది. గత ఎన్నికల్లో రమేష్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పొడచూపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణయ్య కుటుంబం కూడా టీడీపీలో చేరిపోయింది. రెండు కుటుంబాల ప్రస్తుతం టీడీపీలోనే ఉంటున్నాయి. అయితే కాలనీలో రమేష్ కుటుంబ పెత్తనమే సాగుతుంది. ఈ క్రమంలోనే రమణయ్య కుటుంబ సభ్యులు రమేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. కాలనీలో తమ పెత్తనం సాగాలంటే రమేష్ కుటుంబంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు.
మృత్యుంజయరావు గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు పని అయిపోయాక స్పిన్నింగ్ మిల్లు నుండి ఇంటికి బైక్పై వచ్చేవాడు. దీన్ని ఆసరగా చేసుకొని ప్రత్యర్ధులు అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం మిల్లు నుండి ఇంటికి బైక్పై బయలుదేరినమృత్యుంజయరావును నారా కోడూరు సమీపంలో కారుతో ఢీ కొట్టారు. బైక్పై నుండి కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మృత్యుంజయరావు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్య కాలనీలో కలకలం రేపింది. ప్రత్యర్ధులను గ్రామం నుండి బహిష్కరించాలంటూ రమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు చెప్పారు. కారులో పారిపోతున్న ప్రత్యర్ధులను గుర్తించి అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..