
కరోనా సోకినవారిపై బయట సమాజంలో వివక్ష చూపుతోన్న సమయంలో పోలీసులు ప్రజల్లో అపోహలు పోగొట్టే ప్రయత్నం చేశారు. తమ శాఖలో కరోనాను జయించిన కానిస్టేబుల్కు ఘన స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత నిమిత్తం కానిస్టేబుల్ శివకుమార్కు అధికారులు డ్యూటీ వేశారు. అక్కడ అతడు అనారోగ్యానికి గురవ్వడంతో..కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అతడు వ్యాధిపై పోరాడి గెలిచి..తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో తిరిగి డ్యూటీలో చేరుతోన్న అతడికి బాపట్ల పట్టణ పోలీసులు పూలతో అపూర్వ స్వాగతం పలికారు.
పి. శివ కృష్ణ విధుల్లోకి చేరుతున్న సందర్భంగా బాపట్ల టౌన్ సీఐ బి.అశోక్ కుమార్, ఎస్ఐ హాజరతయ్య నేతృత్వంలో పోలీసు సిబ్బంది పుష్ప గుచ్ఛం ఇచ్చి పోలీసు స్టేషన్ లోకి ఆహ్వానం పలికారు. అనంతరం మాట్లాడిన పోలీసు అధికారులు సిబ్బందిలో మనో ధైర్యాన్ని నింపటానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కరోనా పట్ల ప్రజలు అవగాహనతో ఉండి, పరిశుభ్రత పాటించాలని కోరారు. సామాజిక దూరం పాటించి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ కరోనా బారిన పడినా అధైర్యపడొద్దని, వైద్యుల సూచనలు పాటించి కోలువకోవచ్చని వెల్లడించారు. మరోవైపు గుంటూరు గ్రామీణ జిల్లా పరిధిలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుని మరల విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ అభినందించి విధుల్లోకి సాదరంగా ఆహ్వానించారు.