
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగురాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. శుక్రవారం రాత్రి ప్రధాని మోడీ విశాఖపట్నం చేరుకున్నారు. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి కూడలి నుంచి రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ 1.5 కి.మీ మేర రోడ్ షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ముందుకుసాగారు. ఈ సందర్భంగా ప్రజలు మోడీ నినాదాలతో హోరెత్తించారు.
ప్రధాని రోడ్ షో మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ 7.30గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. వర్షం కారణంగా మధురై నుంచి గంటన్నర ఆలస్యంగా విశాఖపట్నం చేరుకున్నారు. ప్రధాని మోడీ రాక ఆలస్యమైనప్పటికీ విశాఖ వాసులు, బీజేపీ కార్యకర్తలు ఆయన కోసం నిరీక్షించారు.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, సాదర స్వాగతం నడుమ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం చేరుకున్నాను. pic.twitter.com/alE1F8yTZy
— Narendra Modi (@narendramodi) November 11, 2022
కాగా.. ప్రధాని మోడీ కాన్వాయ్లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పీఎంవో స్థానం కల్పించింది. దీంతో సోమువీర్రాజు ప్రధానితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ.. ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్నారు.
అనంతరం ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ ముఖ్యనేతలతో మోడీ భేటీ అయ్యారు. పవన్ కంటే ముందుగా బీజేపీ నేతలతో మీటింగ్ షెడ్యూల్లో ఉన్నా.. మోడీ.. పవన్తోనే ముందుగా మాట్లాడారు. 10 నిమిషాల టైమ్ ఇచ్చిన మోడీ.. పవన్ తో 35నిమిషాలపాటు చర్చించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..