
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవవేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో భోగాపురం విమానాశ్రయం ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా.. పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని.. వికసిత భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పోస్ట్పై స్పందించిన సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్ తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు.
ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారన్న అంచనా 5వేల బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే, 7వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భోగాపురంలో ప్రధాని మోదీ ల్యాండైన తర్వాత 13వేల మందికిపైగా గిరిజన బాలికల థింసా నృత్యంతో స్వాగత ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. ఈ థింసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు మంత్రి సంధ్యారాణి.
శనివారం (ఆగస్టు 01) ఉదయం పదకొండున్నర తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఉదయం 10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకుని.. 10:55 వరకు టెర్మినల్ని పరిశీలిస్తారు. పదకొండూ 17 నిమిషాలకు ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా బయల్దేరి పది నిమిషాల్లో సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. పదకొండున్నర తర్వాత ఎయిర్పోర్ట్ను ప్రారంభించి, మాట్లాడతారు ప్రధాని. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైనా.. పూర్తిస్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి మొదలుకానున్నాయ్. ఆరోజు నుంచే భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విశాఖవాసులకు సూచించారు. మూడు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక, ఔషధ రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాయలసీమ ప్రాంతంలో సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దేశానికి ఏపీ ఫార్మా హబ్గా మారబోతోందని పేర్కొన్నారు. నక్కపల్లిలో మరో భారీ ఫార్మా కంపెనీ ఏర్పాటు కానుందని వెల్లడించారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆసియాలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామని, ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు నడియాడిన గొప్ప నేలపై నేడు ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. స్వర్ణాంధ్ర అభివృద్ధి లక్ష్య సాధనలో ఈ రోజు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో విమాన, రహదారి అనుసంధానం మరింత బలోపేతమై, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా, ఆంధ్రప్రదేశ్ యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్ప్యాడ్గా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్ను అభినందించారు. కార్యక్రమంలో ఒకేసారి 13 వేల మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యం నిజంగా అద్భుతమని ప్రశంసించిన ప్రధాని, ఆ నృత్యంలో మన తరతరాల సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించిందని కొనియాడారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర విజన్కు ఇది అత్యంత కీలకమైన రోజని పేర్కొన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో ఉత్తరాంధ్ర పవిత్ర భూమికి రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. విజయనగరం జిల్లా ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై తన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మోదీ వెల్లడించారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కొత్త చరిత్రకు నాంది అని అన్నారు. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తూ, వారు ఈ ప్రాంతానికి బంగారు భవిష్యత్తును అందించారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని నిర్మించడం గర్వకారణమని చెప్పారు. “ఎయిర్పోర్టుకు కొబ్బరికాయ కొట్టింది మనమే.. గుమ్మడికాయ కట్టింది కూడా మనమే” అంటూ వ్యాఖ్యానించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును, 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇకపై ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాకుండా, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు వస్తాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. సుమారు రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భవిష్యత్తులో దీనిని ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీడియో చూడండి…
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వేగంగా ప్రగతి పథంలో నడిపిస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడని పవన్ కల్యాణ్ కొనియాడారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను మోదీ సాకారం చేస్తున్నారని, దేశాన్ని ‘వికసిత్ భారత్’ లక్ష్య దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదన్న ప్రాంతంలో నేడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తైందని” పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు ప్రధానమంత్రి మోదీ రెక్కలు ఇచ్చారని, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ చూపారని అన్నారు. అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు ఉన్న ఉత్తరాంధ్రకు ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం గర్వకారణమని లోకేష్ చెప్పారు. “నమో అంటే ఒక నమ్మకం.. నమో అంటే సురక్షిత భారత్” అని వ్యాఖ్యానించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ నిరంతరం సహకరిస్తున్నారని, కేంద్రం-రాష్ట్రం సమన్వయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉత్తరద్వారంగా మారబోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. యుగానికి ఒక్కసారి మాత్రమే జరిగే కార్యక్రమంలో ఉత్తరాంధ్రలో జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని, ఈ విమానాశ్రయం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు “ఎర్రబస్సులు కూడా తిరగని ప్రాంతం” అంటూ విమర్శలు ఎదుర్కొన్న భోగాపురానికి నేడు ఎయిర్బస్సులు వచ్చే స్థాయికి తీసుకురావడం గర్వకారణమని రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక ఇంజిన్గా పనిచేస్తుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, ఎగుమతులకు ఇది కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నవ్యాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ, మత్స్య, పారిశ్రామిక ఉత్పత్తులను ఇకపై నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మరింత విస్తరిస్తాయని శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకతను ప్రతిబింబించే పొందూరు ఖాదీ శాలువాను కప్పి ప్రధానికి సత్కారం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను మోదీకి జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఉన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. రాష్ట్ర కళా, సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులతో ప్రధానికి స్వాగతం పలకడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓపెన్టాప్ జీపులో చేరుకున్నారు. సభా వేదిక వద్దకు వచ్చిన ప్రధానికి ప్రజలు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ, జాతీయ జెండాలు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉన్నారు. అనంతరం వేదికపైకి ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేరుకున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. ఇది, ఇప్పటి తరం విమానాశ్రయం.. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్.. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు-వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం, రూ.5,640 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే.. 31 నెలల రికార్డు టైమ్లోనే పూర్తిచేశారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నిర్మాణ విశేషాలు, టెర్మినల్ మాస్టర్ ప్లాన్, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, సదుపాయాలను పరిశీలిస్తున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించనున్నారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీర్చిదిద్దారు. విమానాశ్రయం లోపల తోలుబొమ్మల కళ, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, భౌగోళిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగినపల్లి మామిడి వంటి కళా చిత్రాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అలాగే విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేశారు. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 12 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని తిలకించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర ప్రముఖులతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజనుల సంప్రదాయ ‘థింసా’ నృత్యంతో ఘన స్వాగతం పలికేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏకరూప దుస్తుల్లో వేలాది మంది కళాకారులు పాల్గొన్న థింసా నృత్య రిహార్సల్ ఇప్పటికే అతిపెద్ద థింసా నృత్య ప్రదర్శనగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అలాగే విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళా, సంస్కృతి ప్రతిబింబించేలా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన స్వాగత ద్వారం వద్ద ఆంధ్రప్రదేశ్కు ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక కళాకృతిని భారీ స్థాయిలో ఏర్పాటు చేసి సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా అలంకరించారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉదయం 10.58 గంటలకు ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నుంచి భోగాపురం బయలుదేరారు. కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రముఖులతో కలిసి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన రైతులకు ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనికి స్పందించిన జీఎంఆర్ సంస్థ రైతులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి ముందు, తర్వాత అక్కడ చోటుచేసుకున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించి, భోగాపురం ప్రాంత భవిష్యత్ అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి, ప్రధానమంత్రి ఆసీనులయ్యే సభావేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన వీవీఐపీ గ్యాలరీలో వారికి ప్రత్యేక స్థానాలు కేటాయించింది. భోగాపురం మండలంలోని గూడెపువలస, రావాడ, కంచేరు, కవులువాడ, ఎ. రావివలస, సవరవిల్లి, ముంజేరు గ్రామాలకు చెందిన 403 మంది భూములు ఇచ్చిన రైతులు, 1,600 మంది ఇళ్లు ఇచ్చిన కుటుంబాలు, అలాగే పొలం, ఇల్లు రెండూ ఇచ్చిన 200 మంది ఈ గౌరవానికి అర్హులయ్యారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు హాజరుకానుండటంతో విశాఖ జిల్లా నుంచి 1,465 బస్సులు, అనకాపల్లి జిల్లా నుంచి 500 బస్సులు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇప్పటికే 140 బస్సుల్లో గిరిజన విద్యార్థులు, కళాకారులను తరలించగా, మరో 46 బస్సుల్లో 11 మండలాల ప్రజలను తీసుకువస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఇన్చార్జ్లుగా నియమించారు. అనకాపల్లి, భీమిలి, ఈస్ట్, సౌత్, నార్త్, గాజువాక నియోజకవర్గాల నుంచి ప్రత్యేక మార్గాల ద్వారా భోగాపురానికి బస్సులు నడుపుతున్నారు. సభ అనంతరం ప్రజలు సురక్షితంగా తిరిగి వెళ్లేలా రవాణా, వివిధ ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు కూడా అధికారులు పకడ్బందీగా చేశారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతిరోజూ హైదరాబాద్–భోగాపురం మధ్య ఐదు సర్వీసులు, విజయవాడ–భోగాపురం మధ్య నాలుగు సర్వీసులు, బెంగళూరు–భోగాపురం మధ్య రెండు సర్వీసులు నడపనుంది. అదనంగా, శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో భోగాపురం–బెంగళూరు మధ్య మరో అదనపు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు విమాన కనెక్టివిటీ మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా ప్రజలు, వీవీఐపీలు హాజరుకానుండటంతో విశాఖలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సిటీ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలను భోగాపురానికి తరలించేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులను వినియోగిస్తున్నారు. బస్సులకు జీపీఎస్ ఏర్పాటు చేసి, వాటి కదలికలను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా సరిహద్దులోనే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగడంతో ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీకాకుళం–భోగాపురం మార్గమంతా సందడిగా మారింది. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత బస్సు సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజన ఏర్పాట్లు కల్పించింది. ప్రయాణికుల కోసం బస్సుల్లో వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర స్నాక్స్ను కూడా అందుబాటులో ఉంచి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక ప్రాజెక్ట్ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. అయితే భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి కీలక మార్గాల్లో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే నిర్వహించాలని సూచించారు. అవసరమైతే జీఎంఆర్ యూడీఎఫ్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని, ప్రతిదీ వాణిజ్య కోణంలో చూడకూడదన్నారు. భోగాపురానికి పూర్తి స్థాయి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడే వరకు విశాఖ విమానాశ్రయ సేవలు కొనసాగించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు.
తాజా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో… ఏపీలో కనెక్టివిటీ, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని కేంద్రం చెబుతోంది. దీంతో మోదీ పర్యటనలు రాష్ట్ర రాజకీయాలతో పాటు అభివృద్ధి చర్చల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
2022లో విశాఖ పర్యటన సందర్భంగా రూ.10,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రైల్వే, రోడ్లు, పోర్టు, పెట్రోలియం, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. విశాఖను బ్లూ ఎకానమీ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని అప్పుడే ప్రకటించారు.
2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ… తాజా భోగాపురం పర్యటనతో కలిపి సుమారు 15 సార్లు ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. కేంద్ర పథకాల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఎన్నికల ప్రచారం, అధికారిక కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఈ పర్యటనల్లో విశాఖపట్నానికే అత్యధిక ప్రాధాన్యం దక్కింది. ఇప్పటివరకు సుమారు 5 సార్లు విశాఖను సందర్శించిన మోదీ… నేవీ ఫ్లీట్ రివ్యూ, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కార్యక్రమాలు, పెట్టుబడుల సదస్సులు, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీకి ఏపీతో ప్రత్యేక అనుబంధం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నానికి పలుమార్లు వచ్చి కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ షెడ్యూల్
ఉ.10:45కి భోగాపురం ఎయిర్పోర్ట్కు మోదీ రాక
ఉ.10:50-10:55 టెర్మినల్ భవనానికి చేరిక
ఉ.10:55-10:58 కూచిపూడి నృత్యంతో స్వాగతం
ఉ.11:00-11:15 ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల పరిశీలన
ఉ.11:17-11:25 ఓపెన్టాప్ జీప్లో సభా వేదికకు మోదీ
ఉ.11:30-12:55 ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, ప్రసంగం
మ.1:05కి భోగాపురం నుంచి ఢిల్లీకి ప్రధాని మోదీ
ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మూడు లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రత్యేకంగా, చిరకాలంగా గుర్తిండిపోయేలా సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.
భోగాపురం వాసులు ఆనందాన్ని అక్షరాల రూపంలో అద్భుత ప్రకృతి సొగసులతో ఈ స్వాగతం సిద్ధం చేశారు. వారి ఆనందాన్ని 30 వేల మొక్కలతో అక్షరాల రూపం ఇచ్చారు. దీనికి సుమారు వారం రోజులు పాటు 70 మంది పని చేశారు. ఈ 30 వేల మొక్కల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో బన్నింగ్ భుష్ గడ్డి మొక్కలు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ గడ్డి బాగా కనిపించేందుకు డార్క్ కలర్ మొక్కలు చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. ప్రధాని విమానం ల్యాండ్, టేకాఫ్ సమయంలో ఈ అపురూప స్వాగతం కనిపించాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు 30 వేల మొక్కలు సిద్ధమయ్యాయి. ప్రకృతి సొగసులతో ప్రధానికి సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ప్రధాని మోదీకి భోగాపురం వాసులు వినూత్న స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్ట్ ప్రారంభ వేడుక వస్తున్నా ప్రధాని మోదీకి విమానం నుంచే కనిపించే విధంగా 30 వేల మొక్కలతో WELCOME.. PM MODI JI, CM CBN JI అని రాశారు. ఇప్పటివరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ఈ తరహా స్వాగతం లభించలేదనే చెప్పాలి.