
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసైన్డ్ ఇంటి స్థలాల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి పూర్తయిన ప్రతి అసైన్డ్ ఇంటి స్థలాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల పేరిటే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గురువారం (మే 21, 2026) అధికారికంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నూతన విధానం ద్వారా దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఉండి కూడా హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు పూర్తిస్థాయి, శాశ్వత హక్కులు లభించనున్నాయి.
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. భవిష్యత్తులో పేదలకు ఇచ్చే అన్ని రకాల ఇంటి స్థలాలపై రెండేళ్ల కాలపరిమితిలోనే పూర్తి హక్కులు కల్పించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
నిషేధిత జాబితా మినహాయింపు: పదేళ్ల గడువు తీరిన అసైన్డ్ స్థలాలు లేదా గతంలో వన్టైమ్ సెటిల్మెంట్ (OTS) కింద రెగ్యులరైజ్ అయిన ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, అక్కడ ఇల్లు నిర్మించి ఉంటే రిజిస్ట్రేషన్కు అనుమతించాలని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో వచ్చే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి.
దీంతో పాటు రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలిదశలో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు నిషేధిత జాబితా నుండి విముక్తి కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 1.6 లక్షల ఎకరాల సర్వీస్ ఇనామ్, షరతుగల పట్టా భూములకు విముక్తి లభించిందని, పట్టణ ప్రాంతాల్లో మరో 10 వేల గృహాలను క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..