
శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో తొక్కిసలాట జరిగింది. రెయిలింగ్ ఊడిపోవడంతో కిందపడ్డారు భక్తులు. ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. ఆలయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరమని.. తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైంది. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుంది. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుంది.
కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నాను. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని.. పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా, పలాస – కాశీబుగ్గ పట్టణం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మరణించడం అత్యంత దురదృష్టకరం. వారిలో చిన్నారి కూడా ఉండటం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో గాయపడిన…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 1, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..