
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించిన కుమారుడిపై కక్ష పెంచుకున్న ఓ తండ్రి.. అర్ధరాత్రి నిద్రలో ఉన్న తన కన్న కొడుకుని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనకండ్ల గ్రామానికి చెందిన గొల్ల బాలమద్దిలేటి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు మధుకృష్ణ జీవాల పెంపకంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతని తండ్రి బాలమద్దిలేటి మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుమారుడు, కోడలితో తరచూ గొడవపడేవాడు.
కొద్ది రోజుల క్రితం భార్యతో గొడవపడుతున్న సమయంలో మధుకృష్ణ తండ్రిని మద్యం తాగొద్దని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలమద్దిలేటి ఇంటిని వదిలి కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామానికి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న మధుకృష్ణ ఆదివారం అక్కడికి వెళ్లి తండ్రిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి భోజనం సమయంలో మజ్జిగ తీసుకురావాలని బాలమద్దిలేటి చెప్పడంతో మధుకృష్ణ డబ్బులు ఇచ్చాడు. అయితే రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన బాలమద్దిలేటి మద్యం మత్తులో నిద్రిస్తున్న కుమారుడిపై గొడ్డలితో ఒక్కసారిగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మధుకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మృతుడి భార్య అర్చన, తల్లి సుబ్బమ్మపై కూడా దాడికి యత్నించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతుడు మధుకృష్ణ భార్య గర్భిణి కావడం ఈ విషాదాన్ని మరింత హృదయవిదారకంగా మార్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.