
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై టీవీ 9 కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. మొత్తం ఏడుగురు విద్యార్థినులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకాగా.. నలుగురు విద్యార్థులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్వయంగా పర్యవేక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అదేంటో తెలీదు.. ఏం రోగమో అర్ధం కాదు.. కానీ అక్కడ 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థినులు వింతగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. కళ్లు తిరిగి పడిపోవడం.. ఏదో పట్టి పీడించినట్టు.. ప్రవర్తించడం.. వంటి వాటితో హడలెత్తించేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా.. దాచి ఉంచారా టీచర్లు. ఇంతకీ వీళ్లకొచ్చిన ఆ కష్టం పేరేంటి? దీనంతటికీ కారణమేంటో అంతుచిక్కడం లేదు. కాకినాడ జిల్లా, యు. కొత్తపల్లి, ఉప్పాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిందీ వింత ఘటన. స్కూల్ కి వచ్చిన విద్యార్థినులు.. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవడం, శ్వాస ఆడక ఇబ్బంది పడ్డం.. కనిపించింది.. వారం రోజులుగా రోజుకు ఇద్దరు ముగ్గురు పరిస్థితి ఇదే కావడం ఆశ్చర్యకరం. శనివారం ఉదయం స్కూలుకొచ్చిన తొమ్మిది, పదో తరగతి విద్యార్ధినులు ఒకరి తర్వాత మరొకరు.. ఐదు మంది వరకూ ఇలా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. పక్క గదిలోకి తీసుకెళ్లి పేపర్ ముక్కలను వాసన చూపించడంతో.. వారు సాధారణ స్థితికి వచ్చారంటున్నారు టీచర్లు.
లంచ్ విరామానికి ముందే జరిగిందీ ఘటన. విషయం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు టీచర్లు. కేవలం పేరెంట్స్ కి మాత్రమే సమాచారమిచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించినా సమస్యకు కారణమేంటో తెలీక పోవడం విడ్డూరం. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పిల్లలకు ఏమైంది? ఎందుకని వీరిలా సొమ్మసిల్లి పడిపోతున్నారు? కారణాలు ఏమై ఉండొచ్చు? ఇదే ప్రస్తుతం ఈ స్కూల్లోని ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రులను తొలచేస్తోన్న ప్రశ్న. ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. కొన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతున్నా.. విషయం బయటకు రాకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దీపావళి సెలవులు కావడంతో.. ఏం జరిగిందని అడుగుదామంటే స్కూలు లేదు. టీచర్లూ అందుబాటులో లేరు. దీంతో ఏం చేయాలో పాలు పోని స్థితిలో పడ్డారా తల్లిదండ్రులు. మరి చూడాలి. ఇది మానసికమైన సమస్యా? లేక శారీరకమైనదా? లేక ఆ వాతావరణంలో ఏదైనా హానికరమైన వాయువులున్నాయా? తెలియాల్సి ఉంది. పొల్యూషన్ అధికారులు వెళ్లి స్కూల్ పరిసరాలను పరిశీలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..