TDP: ఫుల్ క్లారిటీ.. విజయవాడ టీడీపీ ఎంపీ రేసు నుంచి నాని ఔట్
విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఇంట్రస్టింగ్గా మారాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ కూడా తలెత్తింది. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.

అన్నదమ్ముల మధ్య పంచాయితీకి టీడీపీ అధిష్టానం కాస్తా ఫుల్ స్టాప్ పెట్టింది. తిరువూరు ఫైటింగ్తో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం ఈసారి కేశినేని నానికి టిక్కెట్ లేదని తేల్చిచెప్పింది. ఈ నెల 7న జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్లు చేసే క్రమంలో కేశినేని నాని, చిన్నిల మధ్య ఆదిపత్య పోరు పీక్స్కు చేరింది. ఓ దశలో రెచ్చిపోయిన ఇరువురి అభిమానులు డైరెక్ట్ ఫైట్కు దిగారు. అయితే 24 గంటలు తిరిగే లోపే టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేశినేని నాని.
జనవరి 7న తిరువూరులో పర్యటించబోతున్నారు టీడీపీ చంద్రబాబు. ఈ క్రమంలో ఇంతకాలం నాని, చిన్నిల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మొన్నటి దాడితో పీక్స్కు చేరినట్లైంది. ఇక చూస్తు ఉండిపోతే.. మరింత డ్యామేజ్ జరగబోతుందని అంచనా వేసిన టీడీపీ అధిష్టానం నానికి చిన్నపాటి బ్రేక్ వేసింది. ఈసారి ఎంపీ సీటు ఇవ్వడం లేదంటూ స్పష్టం చేసింది. అధినేత చంద్రబాబు సూచనలను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజా.. నాని దగ్గరకు తీసుకెళ్లారు.
విజయవాడ ఎంపీ అనగానే కేశినేని నాని గుర్తొస్తారు. వరసగా రెండు టర్మ్స్ ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. ఇక ముందు కూడా తనకే టికెట్ అన్నట్లు నాని ప్లాన్లో ఉండి ఉంటారు. అయితే అధినేత తాజా సూచనలతో కాస్తా షాక్ తగిలినట్లైంది. మరి ఆ సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు? టీడీపీలో మరొకరికి ఇవ్వబోతున్నారా? పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. కేశినేని చిన్ని. గతంలో ఈ పేరు అంతగా వినిపించకపోయినా.. కొంతకాలంగా అన్నకు ధీటుగా పోటీ పడుతున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో తన మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజక వర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేశినేని చిన్ని. ఈ సారి టీడీపీ టికెట్ ఆయనకే అని ప్రచారం జరుగుతుంది.
ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ, రాజకీయ దాడుల సంగతేమో గాని.. సొంత పార్టీలోనే ఈ స్థాయిలో ఉంటే పార్టీకి నష్టం అని భావించిన చంద్రబాబు.. నానికి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈసారి ఎంపీ సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. పైగా నవంబర్ 7న జరిగే తిరువూరు సభ ఏర్పాట్లను కూడా చిన్నికి అప్పగించారు చంద్రబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
