
ఏలూరు: విద్యకు వివాహం పిల్లలు వయసు అడ్డురావని నిరూపించింది ఓ గృహిణి. తన కొడుకుతో కలిసి పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి రుజువు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మి లహరి అలియాస్ అశ్విని నిరుపేద కుటుంబం కావడంతో ఆరవ తరగతితో విద్యను ఆపేసింది. వివిధ చిన్న చిన్న వ్యాపార సముదాయాలలో పని చేసేవారు. అనంతరం పెళ్లి అవ్వడంతో సంసార జీవితంలో పడిపోయింది. కానీ తాను చదువుకోవాలన్న కోరిక అలానే ఉండిపోయింది. చదువుకోవాలనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక చదువు మానేయడంతో తన కుమారుడు పదవ తరగతి చదువుతుండటంతో తన కుమారుని ప్రోత్సాహంతో ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తన పెద్ద కుమారుడు విజయ్తో పాటు తాను ప్రైవేటుగా పదవ తరగతి పరీక్షకు కట్టి పాస్ అయింది.
రెగ్యులర్గా పరీక్షకు హాజరైన విజయ్కు 600 గాను 562 మార్కులు రాగా.. ప్రైవేటుగా పరీక్ష రాసిన తల్లి అశ్వినికి 500 గాను 360 మార్కులు సాధించారు. తల్లి కొడుకు ఒకేసారి పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంతో పలువురు ఇరువురిని అభినందిస్తున్నారు. అంతేకాక కొడుకే మాస్టర్ గా మారి తల్లికి విద్యను నేర్పడం హర్షించదగ్గ విషయం. డిగ్రీ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యం అని అశ్వినీ తెలియచేశారు. అశ్వినీ పట్టుదలతో పదవ తరగతి పాస్ అవ్వడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో ఒకేసారి పాసైన తల్లీకొడుకు ఆనందానుభూతిని పంచుకుంటూ..పరస్పరం అభినందించుకున్న దృశ్యం ఒక అద్భుతం. మాటలలో వర్ణించలేనిది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి గృహిణిగా ఉంటూనే చదవాలనే లక్ష్యంతో ఓపెన్ స్కూలులో చేరి టెన్త్ పరీక్షలు రాశారు. కొడుకు విజయ్ కూడా టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. ఇద్దరూ ఫలితాల కోసం ఎదురుచూసిన ఉద్విగ్న క్షణాలు..తల్లి 360 మార్కులతో, తనయుడు 562 మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యారని తెలిసిన క్షణాన వారిద్దరి సంబరాలు చూసి ఎంతో ఆనందించాను. అభినందనలు తల్లీ.. ఆశీస్సులు విజయ్.. చిన్న చిన్న కారణాలతో చదువు ఆపేసిన వారు లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను.