
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఓ ఫోటోగ్రాఫర్ అదృశ్యం పోలీసులకు తలనొప్పిగా మారింది. చనిపోతున్నానని లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కానీ అక్కడక్కడా సీసీ కెమెరాల కంట్లో పడ్డాడు. ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎందుకు సూసైడ్ నోట్ రాశాడు? అసలేం జరిగింది. ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
వివరాల్లోకి వెళ్తే.. ఫోటోలో కనిపిస్తున్న ఇతను యురగాని ఆదినారాయణ. ప్రాపర్ పెడన నియోజకవర్గం కాకర్లమూడి శివారు ముత్రాసుపాలెం. ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ దగ్గర ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లేఖ రాసి వెళ్లిపోయాడు. కంగారుపడ్డ కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే సోమవారం రాత్రి ఉల్లిపాలెం-భవానీపురం బ్రిడ్జి దగ్గర బైక్పై వెళ్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కృష్ణానదిలో దూకి చనిపోయాడని పోలీసులు అనుమానించారు. అయితే రెండు రోజులు గడిచినా మృతదేహం ఎక్కడా కనిపించకపోవడంతో సందేహాలు మొదలయ్యాయి.
అదినారాయణ చనిపోలేదని.. ఎక్కడో ఉన్నాడని భావించారు. మరోవైపు కోడూరులోని గంగానమ్మ గుడి సమీపంలో టీ షర్ట్, బ్యాగ్, టోపీ ముఖానికి మాస్క్ ధరించి ఆటో కోసం నడుచుకుంటూ వెళ్తున్నట్టు గుర్తించారు. రెండు చోట్ల రెండు రకాలుగా ఆదినారాయణ కనిపించాడు. దీంతో కొత్త డౌట్లు మొదలయ్యాయి. నిజంగానే ఆత్మహత్య చేసుకునేంతగా ఆదినారాయణకు అప్పులు పెరిగాయా? అదే నిజమైతే వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల డ్రెస్లతో ఎందుకు తిరుగుతున్నాడు? పోలీసులు మాత్రం నారాయణ ఆచూకీ కోసం జల్లెడపడుతున్నారు. మరోవైపు రోజులు గడిచినా ఆదినారాయణ ఎక్కడున్నాడో తెలియక కుటుంబసభ్యలు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ జాడ త్వరగా పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నారు. మరోవైపు ‘తనకు అవగాహన లేకుండా చేసిన కొన్ని పనుల వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నానని.. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన అప్పులతో కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని.. ‘ లేఖలో తెలిపాడు ఆదినారాయణ. కాగా, ఈ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై వేగవంతమైన విచారణ చేపట్టారు ఖాకీలు. త్వరగా ఆదినారాయణ ఆచూకీ కనిపెట్టాలని.. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను పరిశీలించడమే కాకుండా.. సన్నిహితులను కూడా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. జోగి రమేష్ దగ్గర పని చేస్తున్నప్పటి నుంచి ఆదినారాయణను.. మంత్రి అతడ్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, ఎంతగానో సహాయం చేశారని చుట్టుప్రక్కల ఉన్నవారు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..