Andhra Pradesh: ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం కదా.. ఇక అభివృద్ధి జరగడం లేదంటే ఎలా.. మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్

అనంతపురంలో(Anantapur) ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా అని వ్యాఖ్యానించారు. మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు...

Andhra Pradesh: ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం కదా.. ఇక అభివృద్ధి జరగడం లేదంటే ఎలా.. మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్
Dharmana Prasad Rao

Updated on: May 30, 2022 | 7:34 AM

అనంతపురంలో(Anantapur) ఏపీ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా అని వ్యాఖ్యానించారు. మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర(Ministers Bus Tour) ముగింపు సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు వర్గాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి.. అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని మాట్లాడవద్దని సూచించారు. అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుందని, తొందరేమీ లేదని అన్నారు. గతంలోనూ జగన్‌ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదని వెల్లడించారు. మహానాడు(Mahanadu) లో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ధి చెబుతారని మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుతున్నారని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య చెప్పారు. గత ప్రభుత్వం షెడ్యూలు కులాల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే వైసీపీ పాలనలో నాలుగు పదవులిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కార్మికుల ప్రాణాలంటే లెక్క లేకుండా వారికి రావాల్సిన మందులు, ఆరోగ్య పరికరాల్లో అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు త్వరలోనే జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టనున్నారని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని, ఒంగోలులో నిర్వహించిన మహానాడు అట్టర్ ప్లా్ఫ్ అయిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ లీడర్లకే సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. కానీ వైఎస్.జగన్ పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి పలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. నవరత్నాలతో సీఎం జగన్‌ పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి