Andhra Pradesh: జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం! సెటప్ చూస్తే మతిపోవాల్సిందే..

ఎమ్మిగనూరులో సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో పట్టణ సీఐ, సిబ్బంది పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై మెరుపు దాడులు నిర్వహించారు...

Andhra Pradesh: జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌.. లక్షల్లో చేతులు మారుతున్న వైనం! సెటప్ చూస్తే మతిపోవాల్సిందే..
IPL betting racket in Kurnool

Edited By:

Updated on: Apr 20, 2026 | 1:00 PM

కర్నూల్, ఏప్రిల్ 20: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో పట్టణ సీఐ, సిబ్బంది పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు సభ్యుల ముఠాను గుర్తించగా, అందులో ఎమ్మిగనూరు కు చెందిన మహమ్మద్ పాషా వలి, షరీఫ్, రంగాచారి, పెద్దతుంబలంకు చెందిన పవన్ కుమార్ అనే నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఆదోని చెందిన శివమూర్తి, శిరుగుప్పకు చెందిన పీరా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

నిందితుల నుంచి రూ.22 లక్షల నగదుతో పాటు 4 ఖరీదైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ‘డెక్కన్ 247’ పేరుతో ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను క్రియేట్ చేసి, దాని ద్వారా అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ కోసం సంప్రదించే వారికి ఈ ముఠా సభ్యులు ప్రత్యేక లాగిన్ ఐడీలను కేటాయించి, యాప్ ద్వారా పందేలు కాసేలా పక్కాగా వ్యవస్థను ఏర్పాటు చేయడం గమనార్హం.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డీఎస్పీ భార్గవి సూచించారు. ఒక్కసారి పోలీసు కేసు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు తీవ్ర ఆటంకాలు ఏర్పడతాయని, నేర చరిత్ర వల్ల జీవితం నాశనమవుతుందని ఆమె హెచ్చరించారు. పిల్లలు లేదా స్నేహితులు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా గడుపుతూ, అప్పులు చేస్తున్నట్లు గమనిస్తే వెంటనే వారిని మందలించాలని కోరారు. ఎక్కడైనా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112 డయల్ నంబర్‌కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని డీఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us