Andhra Pradesh: మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..

మద్యం మత్తు.. మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా చేస్తోంది. కేవలం 20 రూపాయల చిల్లర గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపబోయినందుకు.. సాటి మనిషిని అక్కడికక్కడే కొట్టి చంపేశారు. అసలు గొడవ ఎలా మొదలైంది.. ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
Man Killed While Trying To Stop A Fight

Edited By:

Updated on: Jun 13, 2026 | 10:24 AM

కేవలం 20 రూపాయల చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవను ఆపడానికి వెళ్లిన ఓ అమాయకుడు మద్యం మత్తులో ఉన్న యువకుల దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. అనంతపురం పట్టణ పరిధిలోని పాపంపేట వద్ద శేఖర్ అనే వ్యక్తి కూరగాయల దుకాణం నడుపుకుంటున్నాడు. కాగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆ దుకాణానికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. వారు కొన్న కూరగాయల బిల్లు 120 రూపాయలు అయింది. అయితే ఆ యువకులు వంద రూపాయలు మాత్రమే ఇచ్చి, మిగిలిన 20 రూపాయల చిల్లర తమ వద్ద లేదంటూ అక్కడి నుంచి వెళ్లబోయారు. బాకీ ఉన్న 20 రూపాయలు ఇవ్వాలని కూరగాయల వ్యాపారి శేఖర్ వారిని గట్టిగా అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు యువకులు మద్యం మత్తులో శేఖర్‌తో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు.

అడ్డుకోబోయినందుకు అంతం చేశారు..

కూరగాయల వ్యాపారి శేఖర్‌పై యువకులు దాడికి దిగడం గమనించిన పక్కనే ఉన్న టీ స్టాల్ యజమాని చంద్ర, గొడవను సర్దిచెప్పడానికి మధ్యలోకి వచ్చాడు. ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఊగిపోతున్న ఆ ఇద్దరు యువకులు.. తమ గొడవకు అడ్డొచ్చాడనే కోపంతో చంద్రపై విరుచుకుపడ్డారు. యువకుల్లో ఒకడు చంద్ర ఛాతిపై బలంగా, గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకు చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన గుండె దెబ్బ కారణంగా చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పట్టణంలో విషాద ఛాయలు

కూరగాయల వ్యాపారిని కాపాడాలనే మానవత్వంతో, గొడవను ఆపడానికి వెళ్లిన చంద్ర ప్రాణాలు కోల్పోవడంతో పాపంపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేవలం 20 రూపాయల కోసం, మద్యం మత్తులో ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Follow Us