అనకాపల్లి జిల్లాలో యువకుడి అదృశ్యం విషాదాంతంగా మారింది. ‘జీవితం మీద ఆశ లేదు.. ఐ మిస్ యూ..’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టి అదృశ్యమైన యువకుడు.. జాలంపల్లి డ్యాంలో శవమైతేలాడు. అనకాపల్లి వి.మాడుగుల మండలం కింతలికి చెందిన శ్రవణ్ కుమార్.. కుటుంబంలో సమస్యలతో తరచూ తీవ్ర ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపంతో వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అయితే, ఈ వాట్సప్ మెసేజ్ చూసినప్పటికీ కుటుంబసభ్యులు లైట్ తీసుకున్నారు. తిరిగి వచ్చేస్తాడు అంటూ కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎందుకంటే గతంలోనూ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబసభ్యుల ముందు శ్రవణ్ కుమార్ పేర్కొనడంతో అంతా లైట్ తీసుకున్నారు.
అయితే.. వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత.. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి కనిపించకుండా పోయాడు శ్రవణ్ కుమార్. శ్రావణ్ కుమార్ కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యులు గాలించారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో వెతికారు. చివరిగా వి.మాడుగుల మండలం కింతలిలోని జాలంపల్లి డ్యాంలో వెతికారు. దీంతో శ్రవణ్ కుమార్ మృతదేహం లభించింది.
శ్రవణ్ కుమార్ ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..