
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 46 మంది రెండు నుంచి పదేళ్లలోపువారు కాగా మిగిలిన ఏడుగురు పెద్దలున్నారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం వైద్య సిబ్బంది మలేరియా నివారణకు క్లోరోక్విన్ మాత్రలను విద్యార్థులు సహా 71 మందికి అందజేశారు. అనంతరం మడివి జమున (7) ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడంతో లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతోపాటు.. పాఠశాల, అంగన్వాడీ చిన్నారులు సైతం అస్వస్థతకు గురవడంతో జిల్లా యంత్రాంగం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. పోలవరం జిల్లా గొల్లగుప్ప ఘటనపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వమించారు. మలేరియా నివారణ క్లోరోక్విన్ టాబ్లెట్లు వికటించి ఒక బాలిక చనిపోయిందనే సమాచారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మరో 24 మందికి లక్ష్మీపురం పిహెచ్సిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షల నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఆసుపత్రికి వెళ్లి బాధితుల పరిస్థితిని చింతూరు ITDO PO, ASP, ఇతర అధికారులు తెలుసుకున్నారని, ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు చనిపోయారనేది నిజం కాదని అధికారులు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని పంపించినట్లు తెలిపారు.
మరో మూడు ప్రత్యేక బృందాలు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ బయలుదేరినట్లు కలెక్టర్ దినేష్ వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిఎం ఆదేశించారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.