Kakinada: పిఠాపురంపై దండెత్తిన మిడతలు.. పంటంతా హాంఫట్.. రైతుల ఆందోళన

|

Aug 19, 2022 | 12:23 PM

బాబోయ్.. మిడతలు అంటున్నారు పిఠాపురం వాసులు. మిడతలు ఏం చేస్తాయ్‌లే అని లైట్ తీసుకోకండి. గుంపులుగా చెట్టు మీద వాలి క్షణాల్లో ఆ చెట్టును ఆకుల్లేని మోడు కింద మార్చేస్తున్నాయి.

Kakinada: పిఠాపురంపై దండెత్తిన మిడతలు.. పంటంతా హాంఫట్.. రైతుల ఆందోళన
Locust Attack
Follow us on

Locust Attack In AP: భారీవర్షాలు, వరదలకో లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని అడవుల్లో ఉండాల్సిన ప్రాణులు జనావాసాలకు చేరుకుంటున్నాయి. కాకినాడ జిల్లా(kakinada district)లో మిడతల దండు దాడులు చేస్తే.. ఏలూరు జిల్లా(eluru district)లో భారీ తాచుపాము హల్‌చల్‌ చేసింది. ఇక కృష్ణా నది తీరం నారాయణపేట జిల్లాలో కనిపించిన భారీ మొసలి స్థానికులను కలవరపెట్టింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మిడతల దండు దాడి చేసింది. ముందుగా ఒక్కొక్కటిగా మొదలైన మిడతలు వందలాదిగా గుమిగూడాయి. ఉప్పాడ రైల్వేగేట్‌ దగ్గర పూలమొక్కలు, కూరగాయల సాగుపై దాడులకు దిగాయి. పచ్చని మొక్కలపై వాలి క్షణాలలో పచ్చని చెట్టును మోడు చేసేస్తున్నాయి. మిడతలను వదిలించుకోవడానికి రైతులు నానాకష్టాలు పడ్డారు. వారం రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు పూలమొక్కలు, కూరగాయలకే పరిమితమైన మిడతలు.. పంటలపై ఎప్పుడు విరుచుకుపడుతాయో తెలియక వణికిపోతున్నారు. అదే జరిగితే పంటలు సర్వనాశనం కావడం ఖాయమంటున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం కనిపించిన మిడతలు.. మళ్లీ రావడంతో ఆందోళన చెందుతున్నారు. మిడతల బెడద నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఏలూరు జిల్లాలో తాచుపాము హల్‌చల్

ఏలూరు జిల్లాలో తాచుపాము కలకలంరేపింది. ఉంగుటూరు మండలం నారాయణపురం ఉన్నతపాఠశాలలో పామును గుర్తించిన సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు. స్టోర్‌రూమ్‌లో ఆరడుగుల పామును చూసి బెంబేలెత్తిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ క్రాంతి.. ఆరడుగుల భారీ తాచుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ సమయంలో పామునోటి నుంచి ఏకంకా మూడు పిల్లిపిల్లలు బయటకు రావడంతో అవాక్కయ్యారు. పామును సురక్షితంగా పట్టుకుని జి. కొత్తపల్లి అటవీప్రాంతంలో వదలడంతో విద్యార్థులతోపాటు పాఠశాల సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

నారాయణపేట జిల్లాలో మొసలి సంచారం

భారీవరదలతో కృష్ణాతీరం ముసళ్లకు కేరాఫ్‌గా మారింది. తెలంగాణ నారాయణపేట జిల్లాలో మొసలి సంచారం అలజడి రేపింది. వరదలకు తీరానికి కొట్టుకొచ్చిన మొసళ్లు క్రమంగా పంటపొలాలకు చేరడంతో స్థానికులు భయంతో బిక్కచచ్చిపోయారు. కృష్ణా మండలం మురార్‌దొడ్డి గ్రామ శివారుకు నదీతీరం నుంచి వచ్చిన పెద్ద మొసలిని గుర్తించారు గ్రామస్థులు. నాలుగు అడుగుల పొడవున్న మొసలిని చూసి భయంతో వణికిపోయారు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..