
మరో 10 నిమిషాల్లో ఆ ఇద్దరూ ఇంటికి చేరుకునేవారు. ఈలోపు వారిని మృత్యువు కబలించింది. బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దిని లారీ రూపంలో యమపాశం వెంటాడింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికేర మండలం మదనంతపురానికి చెందిన గిరి గట్ల రంగస్వామి వీరమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర 23, మల్లికార్జున రమణమ్మల కుమారుడు బాలరాజు 20 ఇద్దరూ వరుసకు బావబామ్మర్దులు. వీరు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గత కొంతకాలంగా వీరిద్దరూ అనంతపురం జిల్లా గుత్తిలో గుజరి దుకాణంలో కూలి పనులకు వెళ్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం పని ముగించుకుని బైక్ పై ఇంటికి బయలుదేరారు. రాత్రి 10:30 సమయంలో మార్గమధ్యలో జొన్నగిరి సమీపంలోని ఎర్ర మన్నుగుట్ల మలుపు వద్దకు రాగానే దగ్గరి వైపు నుంచి వేరుశనగ చెక్క లోడుతో గుత్తి వైపు వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి బైకు ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు తలలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మహేంద్ర మృతి చెందాడు.
ఇక కొన ఊపిరితో ఉన్న బాలరాజును మెరుగైన చికిత్స కోసం అనంతపురం కిమ్స్కు తరలించగా అతను కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో ఒకరైన మహేంద్రకు ఏడాది కిందట వివాహం కాగా.. బాలరాజుకు ఇంకా వివాహం జరగలేదు. కుటుంబానికి ఎంతో ఆసరగా ఉన్న బావ బామ్మర్ది ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.