
పెన్నా నదీ ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. పరశురాముడు ప్రతిష్టించాడని విశ్వాసం. అయితే పురావస్తు నిపుణుల వాస్తవిక అంచనాల ప్రకారం, ఇది 19వ శతాబ్దానికి చెందిన ఆలయంగా నిర్ధారించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ పరిధిలో ఉన్న ఈ నాగేశ్వర స్వామి ఆలయం.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు వందేళ్ల క్రితం గ్రామంతో పాటు ఇసుకలో పూడిపోయిందని స్థానికుల మాట. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కొత్తగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
2020 కరోనా లాక్డౌన్ సమయంలో, గ్రామ యువకులు కొంతమంది కలిసి ఇసుక మేటలలో కూరుకుపోయిన ఆలయాన్ని గుర్తించి, తవ్వకాలు చేసి వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన అప్పట్లో ఆసక్తిని రేపింది. ఎంతో మంది ఈ ప్రాంతానికి వచ్చి, ఇసుక తిన్నెల నుంచి బయటపడిన ఆలయాన్ని చూసి వెళ్లారు. ఈ క్రమంలోనే ‘కల్కి’ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరగడంతో, ఆలయానికి మరింత ప్రాధాన్యం దక్కింది. అయితే అప్పట్లో పురావస్తు శాఖ, దేవాదాయ శాఖలు కొంత హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో, మళ్లీ వచ్చిన వరదల కారణంగా ఆలయం తిరిగి ఇసుక మేటలలో కప్పబడిపోయింది. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు, యువకులు కలిసి విషయం స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికి ఆయనే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండటంతో వెంటనే స్పందించారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు, పురాతన ఆలయ నమూనాలను అనుసరించి నూతన ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో పురాతన ఆలయాన్ని పూర్తిగా వెలికితీయడంతో, మరోసారి ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఎత్తైన ప్రాంతంలో, పాత దేవాలయాన్ని పోలిన విధంగానే నాగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాలగర్భంలో కలిసిపోయిన ఒక ఆలయం.. గ్రామస్తుల విశ్వాసం, పోరాటంతో మళ్లీ జీవం పోసుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..