Andhra Pradesh: బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్.. తప్పించుకునే యత్నం.. పోలీసుల కాల్పులు..

కడప జిల్లాలో కీర్తన అనే మైనర్ బాలిక దారుణ హత్య తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ అమానుష ఘటనపై పోలీసులు గాలింపు చేపట్టగా బసాపురం దగ్గర తప్పించుకునేందుకు యత్నించిన నిందితుడిపై కాల్పులు జరిపారు. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Andhra Pradesh: బాలికను చంపిన కిరాతకుడికి బుల్లెట్ ట్రీట్‌మెంట్.. తప్పించుకునే యత్నం.. పోలీసుల కాల్పులు..
Kadapa Khajipet Minor Girl Murder Case Update

Updated on: Apr 11, 2026 | 7:42 AM

కడప జిల్లా ఖాజీపేటలో మైనర్ బాలిక కీర్తనను అతికిరాతకంగా గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది ఈవుల వెంకటేష్‌ ఉదంతం మరో మలుపు తిరిగింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో వెంకటేష్ గాయపడ్డాడు. బసాపురం చెక్‌పోస్ట్ వద్ద సినిమా ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖాజీపేట మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తనపై అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఈవుల వెంకటేష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. శనివారం బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తన గొంతు కోసి విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కూతురు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

తప్పించుకునే యత్నం.. పోలీసుల కాల్పులు

హత్య అనంతరం నిందితుడు పరారవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బసాపురం చెక్‌పోస్ట్ దగ్గర నిందితుడు వెంకటేష్ పోలీసులకు తారసపడ్డాడు. పోలీసులు అతడిని చుట్టుముట్టగా, లొంగిపోవడానికి నిరాకరించిన వెంకటేష్ పోలీసులపైనే దాడికి దిగాడు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం, నిందితుడు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ కాలికి గాయమైంది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామంలో విషాద ఛాయలు

కీర్తన హత్యతో ఖాజీపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఉన్మాదికి కఠిన శిక్ష పడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కాల్పులు జరిపారన్న వార్త తెలియడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

Follow Us