Bheemili Politics: భీమిలిలో జనసేన vs టీడీపీ సీట్ ఫైట్.. విపక్షాల మధ్య పొత్తులకు ఇంకెంత దూరం..?

| Edited By: Balaraju Goud

Feb 10, 2024 | 8:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన, టీడీపీ కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతున్నాయి. ఇదిలావుంటే, భీమిలి నుంచి పోటీ చేసే ప్రయత్నంలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఏకంగా తాను భీమిలి నుంచి పోటీ చేయబోతున్నట్టు అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చేశారు గంటా. అయితే జన సేన మాత్రం ఆ స్థానం నుంచి మేమే పోటీ చేస్తామని చెబుతోంది.

Bheemili Politics: భీమిలిలో జనసేన vs టీడీపీ సీట్ ఫైట్.. విపక్షాల మధ్య పొత్తులకు ఇంకెంత దూరం..?
TDP, Janasena party
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన, టీడీపీ కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతున్న వేళ.. నమ్మదగిన మిత్రులతోనే పొత్తులంటూ భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన కామెంట్స్‌, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ జనసేన నేతలకు పవన్‌ లేఖ రాయడం మరో కీలకపరిణామంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే భీమిలి వేదికగా జన సేన – టీడీపీ సీట్ ఫైట్ జరుగుతోంది.

భీమిలి నుంచి పోటీ చేసే ప్రయత్నంలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఏకంగా తాను భీమిలి నుంచి పోటీ చేయబోతున్నట్టు అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చేశారు గంటా. అయితే జన సేన మాత్రం ఆ స్థానం నుంచి మేమే పోటీ చేస్తామని చెబుతోంది. 2009 లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించిన ఉమ్మడి రాష్ట్రం లో 18 నియోజకవర్గాలలో ఒకటైన భీమిలి నుంచి పోటీకి సిద్దం కావాలని శ్రేణులకు జనసేన ఇప్పటికే హింట్ ఇచ్చింది. గంటా ప్రయత్నం చేస్తున్నారని తెలిసినా జనసేన మాత్రం గంట కు ఇచ్చే ప్రసక్తే లేదని తమ నేతలకు చెప్తోందట. మరోవైపు టీడీపీ ప్రస్తుత భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజబాబు కూడా గంటాకు ఇస్తే అంగీకరించబోననీ చెబుతుంటే పార్టీ లో ఒక వర్గం రాజబాబుకు సపోర్ట్ చేస్తున్నారట. దీంతో భీమిలి రాజకీయం రసకందాయంలో పడింది.

మొదట భీమునిపట్నంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో భీమిలిగా కొన్ని కొత్త మండలాలను కలిపి ఏర్పడింది. భీమిలిగా మారకముందు టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు దశాబ్దాల పాటు అక్కడ టీడీపీదే ఏకఛత్రాధిపత్యం. 1985, 1989, 1994, 1999 లలో దేవి ప్రసన్న అప్పల నరసింహ రాజు రాజసాగి అక్కడ నుంచి అప్రతిహత విజయాలను నమోదు చేశారు. 2004 లో మాత్రం టీడీపీ పై కేవలం 300 వందల ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలుపొందినా, భీమిలి నియోజకవర్గంగా 2008 లో ఏర్పాటయ్యాక తొలిసారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు. అప్పుడు జరిగిన త్రిముఖ పోటీ లో కేవలం 6 వేల మెజారిటీ వచ్చినా ఆ తర్వాత 2014 లో మళ్లీ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి దాదాపు 37 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 లో మళ్లీ అవంతి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 9 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఇలాంటి నేపథ్యం ఉన్న భీమిలి లో కాపు, యాదవ ఓట్లు గెలుపును నిర్ణయిస్తాయి. ఆ రెండు సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యత లభిస్తుంటుంది.

భీమిలి పై గంటా కన్ను

తాజాగా గంటా శ్రీనివాసరావు మళ్లీ టీడీపీ అభ్యర్ధిగా భీమిలి నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. వాస్తవానికి గంటా ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యే గా ఉంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అంటూ రాజీనామా చేయడం, ఆమోదించడంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం నార్త్ అయినప్పటికీ ఒకసారి పోటీ చేసిన చోట మళ్లీ తదుపరి ఎన్నికలకు అక్కడనుంచి పోటీ చేయనీ నేపథ్యం గంటా శ్రీనివాసరావుది. అందుకే గంటా ప్రస్తుతం మొన్నటి దాకా తాను ప్రాతినిధ్యం వచించిన నార్త్ కాకుండా ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో పావులు కదుపుతూ ఉన్నారు. గతంలో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన నేపథ్యంలో అన్ని విధాలా భీమిలి సేఫ్ ఆన్న ఆలోచనలో గంటా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు.

వాస్తవానికి అక్కడ కోరాడ రాజబాబు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నప్పటికీ గంటా ఆర్ధిక, రాజకీయ బలం తో కచ్చితంగా భీమిలి నుంచి మళ్లీ సీట్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టీడీపీలో అయ్యన్న వర్గం గంటాకు వ్యతిరేకంగా రాజబాబుకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు పార్టీతో డిస్కనెక్ట్ అయి అధికార వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నారు గంటా. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం కొన్నాళ్ళు గంటా ను పట్టించుకోకపోయినా మళ్లీ గంటా టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకోగలిగారన్న చర్చ ప్రస్తుతం పెద్ద స్థాయిలోనే నడుస్తోంది.

భీమిలి మాదే అంటున్న జన సేన

అదే సమయంలో కచ్చితంగా విజయం సాధించే నియోజకవర్గాల్లో భీమిలి ఒకటిగా భావిస్తోంది జనసేన. ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలి వదులుకునే ప్రసక్తే లేదంటోంది జనసేన. 2009 లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించిన ఉమ్మడి రాష్ట్ర 18 నియోజకవర్గాలలో ఒకటైన భీమిలి నుంచి పోటీకి సిద్దం కావాలని శ్రేణులకు జనసేన హింట్ ఇచ్చింది. కాపు సామాజిక బలంతో పాటు టీడీపీకి కూడా బలమైన కేడర్ ఉండడంతో విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు జనసేన భావిస్తోంది. పంచకర్ల సందీప్‌నకు కానీ, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ వంశీని కానీ బరిలోకి దించే ఆలోచనలో ఉంది

ఇక్కడే గంటా తన రాజకీయ చతురత అంతా ఉపయోగిస్తున్నారట. భీమిలి మనదే అని ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు స్పష్టం చేసినట్టు చెప్తున్న క్రమంలో భీమిలినీ తనకు ఇవ్వాలని టీడీపీ పెద్దలకు చెప్పడంతో పాటు పవన్ కల్యాణ్‌కు కూడా చెప్పే ఆలోచనలో ఉన్నాడట గంటా. మెగా కుటుంబంతో గంటాకు మంచి అనుబంధమే ఉన్నప్పటికీ రాజకీయాలలో అలాంటి మొహమాటాలకు తావు లేదని పవన్ స్పష్టం చేస్తున్నారట. భీమిలిలో సర్వే చేయిస్తే అభ్యర్ధితో సంబంధం లేకుండా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందట. దీంతో ప్రస్తుతం జనసేన ఇంచార్జ్ గా ఉన్న సందీప్ 2019 లో పోటీ చేసి 16 వేల ఓట్లు పొందారు. పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు. నిఖార్సైన జన సైనికుడిగా పలుసార్లు పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. దీంతో పవన్ కు కూడా సానుభూతి ఉంది. ఒకవేళ సందీప్ కు కాకపోతే యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇటీవల అధికార పార్టీ నుంచి జన సేన లో చేరిన ఎమ్మెల్సీ వంశీకి ఇస్తే బాగుంటుందని పవన్ ఆలోచిస్తూ ఉన్నారట. కాపులు ఎలాగూ జనసేనకు చేస్తారు. కాబట్టి వంశీ అయితే కచ్చితంగా విజయం సాదిస్తారాన్న అంచనా కూడా పవన్ కు ఉందట. అందుకే టీడీపీకి ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు జనసేన నేతలు.

అదే సమయంలో గంటా కుడా అక్కడ సర్వే చేయించుకుంటే గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ రావడంతో తనకున్న పరపతిని వినియోగించి ఎలాగైనా భీమిలి దక్కించుకోవాలని చూస్తున్నారట. చూడాలి మరీ.. సమీప భవిష్యత్‌లోనే దీని భవితవ్యం బయట పడే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…