Janasena Politics: కడప జనసేనలో కత్తుల యుద్ధం.. తిరుపతి వేదికగా బయటపడ్డ గ్రూపు తగాదాలు!
కడప జిల్లా జనసేనలో 'ఎవరి దారి వారిదే' అన్న చందంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఉన్నది కొద్దిమంది నాయకులే అయినా, గ్రూపులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన జనసేన సమావేశం ఈ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. నేతల మధ్య గొడవలతో కార్యకర్తలు సైతం ఘర్షణకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ పరిణామాలను పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తుండటంతో జిల్లా రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, బలం ఉన్న చోట పోటీ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు రచిస్తుంటే, జిల్లా నేతల మధ్య పోరు కొత్త టెన్షన్ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కడప, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లోని ఆరుగురు నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. వీరి అంతర్గత విభేదాల వల్ల పార్టీ కేడర్ అయోమయంలో పడటమే కాకుండా, కార్యకర్తలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
తిరుపతిలో జరిగిన కడప జిల్లా సమీక్షా సమావేశంలో ఈ వివాదం రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, రాజంపేటకు చెందిన ఎల్లటూరు శ్రీనివాసరాజు, అత్తిగారి కృష్ణ, రైల్వే కోడూరుకు చెందిన తాతంశెట్టి నాగేంద్ర, జోగినేని మణి తదితరులు పాల్గొన్న ఈ సమావేశం కాస్తా కుస్తీ పోటీని తలపించింది. కడప, చిత్తూరు జిల్లాల అధ్యక్షులను మార్చాలంటూ కడపకు చెందిన అడ్వకేట్ గుర్రప్ప చేసిన వ్యాఖ్యలు మంట రాజేశాయి. ఉదయం జరిగిన వ్యాఖ్యల ప్రభావం మధ్యాహ్నం సమావేశంపై పడింది. జోగినేని మణికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో గొడవ పెద్దదైంది.
ఇక కడప జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, అత్తిగారి కృష్ణ, జోగినేని మణి అనుచరులు ఒక వర్గంగా, గుర్రప్ప అనుచరులు మరో వర్గంగా ఏర్పడి పార్టీ అబ్జర్వర్ బాలినేని ముందే కొట్టుకున్నంత పని చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాల్సిన సమావేశం, ఇలా నేతల ఆధిపత్య పోరుకు వేదికగా మారడంపై హైకమాండ్ సీరియస్గా అయినట్టు తెలుస్తోంది. కార్యకర్తలను విస్మరించి, సొంత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేతల తీరుపై జనసేనాని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఉన్నది కొద్దిమందే నేతలైనా ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించడంతో కడప జిల్లాలో జనసేన దారెటు అన్న సందేహం వ్యక్తమవుతోంది.
కార్యకర్తలను విస్మరించి సొంత వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అంతర్గత విభేదాలకు కారణమవుతున్ననేతలు తీరుపై జనసేన హై కమాండ్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీ అబ్జర్వర్ బాలినేని ఎదుటే జరిగిన రణరంగం పై అయన ఇచ్చే నివేదికలో ఏముంటుందో, జనసేనాని ఎలా స్పందిస్తారో, ఏకపక్షంగా వ్యవహరించే కడప నేతలపై జనసేనాని ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు కానీ.. జనసేన పరువు మాత్రం రోడ్డున పడేసేలా గ్రూపులు కట్టిన నేతల వ్యవహారం మాత్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు కారణమైంది.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
