Andhra Pradesh: దయనీయం వారి జీవితం.. నాలుగేళ్లుగా రిక్షానే ఆ తల్లికి నివాసం.. !

|

Aug 03, 2022 | 9:20 PM

Andhra Pradesh: నాలుగేళ్ళుగా రిక్షాలోనే ఆ తల్లీ నివాసం ఉంటోంది. కళ్లు కనపించని, మాటలు వినిపించని ఆ వృద్ద తల్లికి సేవలు చేస్తూ..

Andhra Pradesh: దయనీయం వారి జీవితం.. నాలుగేళ్లుగా రిక్షానే ఆ తల్లికి నివాసం.. !
Rikshaw House
Follow us on

Andhra Pradesh: నాలుగేళ్ళుగా రిక్షాలోనే ఆ తల్లీ నివాసం ఉంటోంది. కళ్లు కనపించని, మాటలు వినిపించని ఆ వృద్ద తల్లికి సేవలు చేస్తూ ఆ కొడుకు కూడా ఆమె దగ్గరే ఉంటున్నాడు. పండుముదుసలిగా ఉన్న తన తల్లి అనారోగ్యం పాలయినా కంటిపాపలా చూసుకుంటున్నాడు. అయితే, వ్యాపారంలో నష్టం రావడంతో ఉండటానికి ఇల్లు కూడా లేని దుస్థితికి చేరారు. దాంతో కట్టుకున్న భార్య కూడా అతన్ని విడిచి వెళ్లింది. ఆరేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆమెకు కొడుకు, అతనికి తల్లి తప్ప ఎవరూ లేరు. ఊళ్ళో ఉంటున్న ఇల్లు పంచాయతీది కావడంతో కూలగొట్టేశారు. ఇక ఎవరి పంచన ఉండలేక, ఒక రిక్షాలోనే తన తల్లిని ఉంచి సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ కొడుకు. కనీసం తల్లికి వృద్యాప్య పింఛను మంజూరు చేస్తే ఆ ఆధారంతోనైనా బతుకుతామని విన్నవించుకుంటున్నాడు.

వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నిరుపేద దేవరకొండ పోలేరమ్మ, ఆమె కుమారుడు దుర్గయ్య అంత్యంత దయనీయంగా జీవిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం పోలేరమ్మ భర్త చనిపోగా, ఒక్కగానొక్క కొడుకు దుర్గయ్య ఆధారం ఆయ్యాడు. గతంలో పలు చోట్ల సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన దుర్గయ్య ప్రస్తుతం అమ్మ సేవకే పరిమితం అయ్యాడు. ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండీ లేదు. దీనికి తోడు పోలేరమ్మకు కళ్ళు కనబడవు, చెవులు వినబడవు. పండు ముదుసలి.. ఆమె బతికి ఉన్న జీవచ్ఛవంలా గత ఐదేళ్ళుగా బతుకు పోరాటం చేస్తుంది. దీంతో కుమారుడు తల్లి కోసం ఓ పాతరిక్షాను ఇంటిగా మార్చి సపర్యలు చేస్తూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం పేదలకు అందించే కనీస పింఛను కూడా అందక ఇబ్బందిపడుతున్నారు. దాతలు ఏదో కొంత సాయం చేస్తే ఆ పూట తిండి ఉంటుంది. లేకుంటే పస్తులే. ఈ క్రమంలో తల్లీ కుమారుడు ఒంగోలులోని కలెక్టరేట్‌ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించుకోవాలని, ప్రభుత్వం అందించే ఏదైనా పథకం తమకు వచ్చేలా చూడాలని ఎదురుచూస్తున్నారు. అయితే అక్కడ వారి గోడు ఆలకించేవారు కరువయ్యారు. దీంతో తన తల్లిని తీసుకుని రిక్షాలో ఊసురుమంటూ తిరుగుతున్నాడు. తన తల్లికి పింఛన్‌ మంజూరు చేస్తే ఆ ఆధారంతోనైనా బతుకుతామని దుర్గయ్య అర్ధిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..