
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అల్లిపురం దాబా గార్డెన్స్ ప్రాంతంలోని.. 33 వ వార్డు.. కంఠం వారి వీధి.. అర్ధరాత్రి 12 దాటింది. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్లు పడుకున్నారు. ఒక్కసారిగా కుక్కలు అరవడం ప్రారంభించాయి. రోజు ఎప్పుడు ఒక సమయంలో అరుస్తాయి కదా అని లైట్ తీసుకున్నారు స్థానికులు. అదేపనిగా కుక్కలు గట్టిగట్టిగా అరుస్తూనే ఉన్నాయి. దీంతో డౌట్ వచ్చి కొంతమంది బయటకు వచ్చి చూశారు. ఎవరు కనిపించలేదు. ఇంకా ఆ కుక్కలు అరుస్తూనే ఉండడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశారు. చీకట్లో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. కాస్త లైట్ వేసి చూసేసరికి.. ఓ భారీ కొండచిలువ మెల్లగా పాకుతూ వెళ్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా గుండెలు పట్టుకున్నారు. వెంటనే స్నేక్ కేచర కిరణ్ కుమార్కు సమాచారం అందించడంతో.. అర్ధరాత్రి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా ఆ పైథాన్ ను డ్రమ్ములో బంధించారు.
ఆరడుగుల కొండచిలువను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పొదలు గాని కొండలు గాని లేవు.. మరి కొండచిలువ ఎక్కడ నుంచి వచ్చి ఉంటుందా అని అంతా చర్చించుకున్నారు. ‘ఆ ప్రాంతానికి కొండచిలువలు వచ్చే అవకాశం లేదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండచిలువలు ఆవాసాలు లేవు.. కానీ ఆ పక్కనే మార్కెట్ ఉంది.. కూరగాయల లోడుతో వాహనాలు వస్తూ ఉంటాయి.. బహుశా ఆ వాహనాలతోనే ఆ కొండచిలువ ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుంది ‘ అని టీవీ9 తో అన్నారు స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమాచారం అందించాలని సూచించారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..