Kadiyam Flowers: శ్రవణంలో మొదలైన వ్రతాలు, వివాహల సందడి.. కడియం పూల ధరకు రెక్కలు..

వ్రతాలతో పాటు.. వివాహ ముహూర్తాలు ఒక్కసారిగా వచ్చేసాయి. దీంతో పువ్వులకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. పూల రైతులు నాలుగు డబ్బులు కళ్ల చూసే రోజులివి. కానీ వరద గోదారమ్మ ముందే రావడంతో..

Kadiyam Flowers: శ్రవణంలో మొదలైన వ్రతాలు, వివాహల సందడి.. కడియం పూల ధరకు రెక్కలు..
Kadiyam Flowers

Updated on: Aug 05, 2022 | 7:40 PM

Kadiyam Flowers: శ్రావణమాసం వస్తే చాలు పండగలు, పర్వదినాలతో పాటు.. వివాహ ముహూర్తాలను తీసుకొని వస్తుంది. శుభకార్యాలకు శుభప్రదమైన శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా శుక్రవారం రోజున వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, మంగళవారం మంగళగౌరి వ్రతాలతో పాటు.. వివాహ ముహూర్తాలు ఒక్కసారిగా వచ్చేసాయి. దీంతో పువ్వులకు ఎక్కడలేని డిమాండ్ పెరిగిపోయింది. పూల రైతులు నాలుగు డబ్బులు కళ్ల చూసే రోజులివి. కానీ వరద గోదారమ్మ ముందే రావడంతో పూల తోటలన్నీ నీటమునిగి రైతుకు కన్నీటినే మిగిల్చాయి. దీంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు పువ్వులను దిగుమతి చేసుకోవాల్సివస్తుంది. పువ్వులు అధికంగా పండించే కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో లంక భూములన్ని వరద ముంపుకు గురయ్యాయి. శ్రావణమాసం కోసం ఎదురుచూసే పూల రైతులకు ముందే వచ్చిన వరదలు శాపంగా మారాయి. దాంతో ఒక్కసారిగా పూల ధరలు పెరిగిపోయాయి.

కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన ఉస్తురు, డిగ్నికోట,బాలతోట్,వస్స్ కోట, ఈ కోట తదితర ప్రాంతాల నుంచి బంతి, చామంతి, గులాబీలను దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా పూల లభ్యత స్వల్పంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో పూలధరలు పరిశీలిస్తే.. బంతిపూలు కిలో వంద నుంచి 150 రూపాయలు, చామంతి 250 నుంచి 350, లిల్లీ 300 నుంచి 350, జాజులు 1000 నుంచి 1200 రూపాయలు పలుకుతుండగా.. మల్లెపూలు మాత్రం 1500 నుంచి 1700 వరకూ ధర పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..