Andhra Pradesh: ఆరు నెలల పాపకు రూ.25లక్షల విలువైన సర్జరీ.. ఉచితంగా చేసిన గుంటూరు వైద్యులు

| Edited By: Srilakshmi C

Jul 29, 2024 | 7:15 PM

ఆరు నెలల చిన్నారి.. అంతుచిక్కని రోగంతో సతమతమయింది. ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి చిన్నారికి సోకింది. ప్రపంచంలో 100 కంటే తక్కువ కేసులు నమోదైన రోగం పీడించింది. చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేయడంతో వ్యాధి నుంచి కోలుకొని చిరునవ్వులు చిందిస్తుంది. క్రిష్ణా జిల్లా..

Andhra Pradesh: ఆరు నెలల పాపకు రూ.25లక్షల విలువైన సర్జరీ.. ఉచితంగా చేసిన గుంటూరు వైద్యులు
Guntur GGH doctors perform rare surgery
Follow us on

గుంటూరు, జులై 29: ఆరు నెలల చిన్నారి.. అంతుచిక్కని రోగంతో సతమతమయింది. ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి చిన్నారికి సోకింది. ప్రపంచంలో 100 కంటే తక్కువ కేసులు నమోదైన రోగం పీడించింది. చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేయడంతో వ్యాధి నుంచి కోలుకొని చిరునవ్వులు చిందిస్తుంది. క్రిష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన శోభన్ బాబు, సుప్రియ దంపతులు ఈ ఏడాది ఫిభ్రవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే డెలివరీ సమయంలో ఇబ్బందులు తలెత్తి సుప్రియ కన్ను మూసింది. చిన్నారికి పిట్స్ రావడంతో అత్యవసర వైద్యం అవసరమైంది. అప్పటికప్పుడు చికిత్స చేసిన వైద్యులు చిన్నారిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. దీంతో శోభన్ బాబు చిన్నారిని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే అప్పటి నుంచి చిన్నారి ఆరోగ్యం సరిగా ఉండకపోవడాన్ని గమనించాడు. విజయవాడలోని ప్రవేటు ఆసుప్రతుల చుట్టూ తిప్పాడు. చివరికి పాప పొట్టలో కణితి ఉందని దాన్ని తొలగించాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అంత భరించే స్తోమత లేని తండ్రి చిన్నారిని బ్రతికించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని ఇచ్చిన సలహా మేరకు జిజిహెచ్ లోని పిడియాట్రిక్ వార్డుకు తీసుకొచ్చారు. డాక్టర్ భాస్కర్ రావు అన్ని వైద్య పరీక్షలు చేసి చిన్నారికి సెంట్రిక్ సిస్ట్ ఉన్నట్లు తేల్చారు. ఈ కణితి పొట్ట వెనుక భాగం నుండి ప్రారంభమై రక్త నాళాలతో కలిసి పోయి ఉన్నట్లు గుర్తించారు. అత్యంత అరుదుగా వచ్చే కణితిగా నిర్ధారించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. తండ్రి శోభన్ బాబు ఒప్పుకోవడంతో భాస్కర్ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

 

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఇటువంటి ఆపరేషన్ ప్రవేటు వైద్యశాలలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చవుతుందని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఆపరేషన్ చేశామన్నారు. అత్యంత్య అరుదైన శస్త్రచికిత్స కావడంతో ఛాలెంజిగా తీసుకొని పిడియాట్రిక్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారన్నారు. పేదలకు జిజిహెచ్ లో మెరుగైన వైద్యం అందించడంలో జిజిహెచ్ ముందంజలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.