Vande Bharat: గుడ్‌న్యూస్‌.. త్వరలో ఏపీకి మరో వందేభారత్‌..! ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తి..

|

May 22, 2023 | 5:08 PM

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 2023 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన హై-స్పీడ్ రైలు అయిన 75 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్నది భారతీయ రైల్వే లక్ష్యంలో భాగంగా పెట్టుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహించారు..

Vande Bharat: గుడ్‌న్యూస్‌.. త్వరలో ఏపీకి మరో వందేభారత్‌..! ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తి..
Vande Bharat Express
Follow us on

ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల కాలం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. వందే భారత్‌ రైళ్లకు అంతకంతకూ ప్రజాదరణ పెరిగిపోతుంది. బుల్లెట్‌ వేగం వీటి ప్రత్యేకత. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్‌ ప్రయాణికులకు ఓ కొత్త అనుభూతిని పంచుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టగా, ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది. వందే భారత్ రైళ్లను నడపడం ద్వారా… భారతీయ రైల్వేకు ఆదాయం కూడా భారీగా ఆదాయం వస్తోంది. టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వందే భారత్‌లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో వందేభారత్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఏపీకి మరో వందేభారత్‌ రైలు రాబోతున్నట్టుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న ఏపీ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ.. బుధవారం రోజున శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఆగింది ఒక వందేభారత్‌ రైలు. రాత్రి 7.15 గంటల సమయంలో వందేభారత్‌ రైలు స్టేషన్‌లో ఆగింది.. ఈ ట్రైన్‌ను చూసేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు.. పోటాపోటీ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అయితే, ఈ రైలు పలాస స్టేషన్‌లో ఆగడం పట్ల రైల్వే సిబ్బందికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో వారు కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. ఈ వందేభారత్ దాదాపు పది నిమిషాల పాటు పలాస రైల్వే స్టేషన్‌లోనే ఆగిందట. డ్రైవర్లు, గార్డులు మారిన తర్వాత నుంచి రైలు అక్కడి నుంచి కదిలింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పలాసకు తొలిసారి రావడం ఇక్కడ విశేషం.

ఏపీ మీదుగా.. ఒడిశాలోని భువనేశ్వర్ వరకు.. వందేభారత్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పలాసలో ఆగిన రైలు విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్‌ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 2023 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన హై-స్పీడ్ రైలు అయిన 75 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్నది భారతీయ రైల్వే లక్ష్యంలో భాగంగా పెట్టుకుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహించారు.. దేశంలోని వివిధ రాష్ట్రాలను కలుపుతూ ఇప్పటివరకు 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి.