
Gangireddy Pond – Anantapuram district : అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలో కురుస్తోన్న భారీ వర్షానికి గంగిరెడ్డిపల్లి చెరువు కట్ట తెగిపోయింది. గతంలో చెరువు కట్ట నాసిరకంగా నిర్మించడంతో భారీ వర్షాలు, వరద నీటితో కట్ట కోతకు గురైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూము దగ్గర నీరు లీకై పంట పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంటలకు నష్టం వాటిల్లుతోంది.
చెరువులోని నీరు పొలాల్లోకి చేరుతుండడంతో వేరుశనగ, టమాటా, వంకాయ, మొక్కజొన్న, రాగి, వరి పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల్లో పంట దెబ్బతింటోందని వాపోతున్నారు. గతంలో చెరువు కట్టకు మరమ్మతులు చేసినా నాసిరకం పనులతో ఫలితం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు చెరువులు నిండుకుండలా మారుతున్నాయి. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇదే సమయంలో చెరువుల కట్టలు ప్రమాదకరంగా మారుతున్నాయి. మట్టి కొట్టుకుపోతుండడంతో జిల్లాలోని చెరువు కట్టల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.
Read also: Hyderabad Road accident : హైదరాబాద్ బాలానగర్లో విచిత్ర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో యువకుడు మృతి