Prakasam barrage Boats: మూడు ప్లాన్‌లు ఫెయిల్‌… తెరపైకి మరో థాట్..

|

Sep 16, 2024 | 7:50 AM

-ప్లాన్‌లు మీద ప్లాన్‌లు... ఒకటి కాదు.. రెండు కాదు...మూడు ప్లాన్‌లు ఫెయిల్‌... తెరపైకి మరో ప్లాన్‌... ఎస్‌.. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపు వ్యవహారం చాలెంజ్‌గా మారుతోంది. రోజులు గడుస్తున్నా.. ప్లాన్‌లు మారుతున్నా.. ఫలితం మాత్రం మారడం లేదు. మూడు బోట్ల తొలగింపులో మూడు విధానాలు అమలు చేసినా నిరాశే ఎదురవడంతో ప్లాన్‌- ఫోర్‌పై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇంతకీ.. బోట్ల తొలగింపు ప్రక్రియ ఎందుకు కష్టతరంగా మారుతోంది?.. నెక్ట్స్‌ అమలు చేయబోయే ప్లాన్‌ ఫోర్‌ ఏంటి?.. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు నిపుణులు, అధికారులు ఏం చేయబోతున్నారు?...

Prakasam barrage Boats: మూడు ప్లాన్‌లు ఫెయిల్‌... తెరపైకి మరో థాట్..
Prakasam Barrage
Follow us on

ప్లాన్లు మారినా.. ఫలితం మాత్రం మారడం లేదు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. 3 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నదిలో చిక్కుకున్న పడవ నీటిలో దిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం ఏర్పడింది.

ఆపరేషన్‌లో ఫలించని నిపుణుల ప్రయత్నాలు

ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇప్పటి వరకు పైకి కనిపించిన బోటు..కృష్ణానదిలోకి దిగిపోయింది. భారీ ఇనుప రోప్‌లను మెలికవేసి క్రేన్‌తో లాగుతుంటే..కొంచెం కొంచెం మాత్రమే కదులుతోంది. లాగుతున్న కొద్దీ రోప్‌, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర మొత్తం మూడు బోట్లు ఉన్నట్టు బెకమ్‌ కంపెనీ ఇంజనీర్లు, అబ్బులు టీం గుర్తించింది. వీటిలో ఒక్కో బోటును తొలగించడానికి నిపుణులు వేస్తున్న ప్రణాళికలు ఫలించడం లేదు.

బోటును ఆక్సి ఆర్క్‌ కటింగ్‌తో ముక్కలు చేయాలని నిర్ణయం

నీళ్లలో పైకి కనిపిస్తున్న బోటును ఆక్సి ఆర్క్‌ కటింగ్‌తో రెండు ముక్కలు చేస్తే తొలగింపు సులువుగా ఉంటుందని మొదట భావించారు. అయితే ఆ ప్లాన్‌ రివర్సయింది. బోటులోకి నీళ్లు ప్రవేశించడంతో అది కిందికి దిగిపోయింది. అయితే బోటును యథాస్థితికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని లాగడం కష్టతరమవుతోంది. బ్యారేజీ గేటు వద్ద నీళ్లలో మునిగిపోయిన బోటు.. ఐదు నుంచి పది అడుగుల ముందుకు వచ్చినట్టు కార్మికులు చెబుతున్నారు. బోటు బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత భావించారు. అయితే తాజా పరిణామాలను బట్టి ఒక్కో బోటు 100 టన్నుల వరకూ బరువు ఉంటుందని అబ్బులు టీం గుర్తించింది.

విశాఖ నుంచి రంగంలోకి దిగిన సీ లయన్‌ కంపెనీ డైవర్లు

బోటుకు అడుగు భాగాన ఆక్సి ఆర్క్‌ కటింగ్‌ ద్వారా కట్‌ చేయాలని భావించారు. ఇందుకోసం వైజాగ్‌ నుంచి సీ లయన్‌ కంపెనీ డైవర్లు రంగంలోకి దిగారు. నీళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటు అడుగు భాగాన్ని పూర్తిగా కట్‌ చేయలేకపోయారు. అవకాశం ఉన్న మేరకు కట్‌ చేశారు. ఈ రంధ్రాల నుంచి లోపలకు నీరు ప్రవేశించి.. బోటు మునిగిపోయిందని భావిస్తున్నారు. భారీ ఇనుప రోప్‌ను ఘాట్‌ మీద నుంచి ఒక క్రేన్‌ లాగుతోంది. అయితే రోడ్డు విశాలంగా లేకపోవడంతో ఆపరేషన్‌కు ఇబ్బంది కలుగుతోంది.

వాటర్‌ లోడింగ్‌ ప్లాన్‌ అమలు చేయాలనుకున్న అబ్బులు టీమ్

ఎన్ని ప్రయత్నాలు చేసినా బోటు కొంతమేరకు మాత్రమే ముందుకు కదులుతుండటంతో వాటర్‌ లోడింగ్‌ ప్లాన్‌ అమలు చేయాలని అబ్బులు టీం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బోట్లను లాగడానికి గొల్లపూడి నుంచి ఆరేడు కార్గో బోట్లను రప్పించారు. వీటిలో రెండింటిని పూర్తిగా నీటితో నింపి.. మునిగి ఉన్న బోటుతో లాక్‌ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ బోట్లు నీళ్లలోకి దిగుతాయి. తర్వాత వాటిలో ఉన్న నీటిని తోడేస్తారు. దీంతో అవి పైకి వచ్చే సమయంలో మునిగిన బోటు కూడా పైకి లేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తుందని అబ్బులు టీం భావిస్తోంది. నీళ్లలో మునిగిన ఓడలను పైకి లేపడానికి బెలూన్‌ టెక్నాలజీ ఉన్నా అది ఇలాంటి చోట్ల పనిచేయదని అబ్బులు చెబుతున్నారు. దీంతో ఆపరేషన్‌ పూర్తి కావడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.