అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌ చూస్తే..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాబ్దానికి పైగా కలం పట్టిన ఓ జర్నలిస్ట్, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలకు తాళలేక తనువు చాలించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని మెంటిపేటకు చెందిన మాజీ విలేకరి అద్దంకి కృష్ణ అలియాస్ మధు (45) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు స్నేహితులకు ఓ భావోద్వేగ చివరి సందేశం పంపారు.

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌ చూస్తే..
Rajam former journalist death

Edited By:

Updated on: Aug 30, 2026 | 2:09 PM

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలతో కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురైన మాజీ జర్నలిస్టు అద్దంకి కృష్ణ అలియాస్ మధు (45) ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజాంలో విషాదాన్ని నింపింది. శనివారం వేకువజామున తాను నివసిస్తున్న అపార్ట్మెంట్‌లో మృతిచెందారు. ఘటనకు ముందు ఆయన తన స్నేహితులు, పరిచయస్తులకు పంపిన చివరి సందేశం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని మెంటిపేటకు చెందిన అద్దంకి కృష్ణ దశాబ్దానికి పైగా ఓ ప్రముఖ దినపత్రికకు రాజాం విలేకరిగా పనిచేశారు. స్థానికంగా జర్నలిస్టుగా మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నారు.

అయితే, కొన్నేళ్ల క్రితం మధు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. గుండె ఆపరేషన్‌ జరిగిన అనంతరం పక్షవాతం రావడంతో శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చాలాకాలంగా ఇంటికే పరిమితమైన కృష్ణకు భార్య నర్మద సేవలు అందిస్తూ వచ్చారు. మరోవైపు అన్నదమ్ముల మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు కూడా చుట్టుముట్టాయి. కొన్ని ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కుమార్తె నర్మదసాయికి ఫార్మసీలో సీటు రావడంతో చదువు కోసం కొంత మొత్తం అవసరమైంది. ఇప్పటికే వైద్య ఖర్చులు, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణ తన కుమార్తె ఫీజు విషయమై మరింత ఆందోళన చెందాడు. దీంతో బలవన్మరణానికి సిద్ధమయ్యాడు.

ఆత్మహత్యకు ముందు కృష్ణ తన మొబైల్ ద్వారా స్నేహితులకు ఓ భావోద్వేగ సందేశం పంపాడు. జీవితంలో తాను ఓడిపోయానని, తన జీవనయాత్రను ముగిస్తున్నానని పేర్కొన్నాడు. తన అంత్యక్రియలను త్వరగా పూర్తి చేయాలని, భార్య, కుమార్తెకు సహకరించాలని స్నేహితులను కోరారు. కృష్ణ మృతి పై తనకు ఎలాంటి అనుమానాలు లేవని ఆయన భార్య నర్మద పోలీసులకు తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యం, గతంలో జరిగిన గుండె శస్త్రచికిత్స, అనంతరం ఎదురైన పక్షవాతం కారణంగా తీవ్ర నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రాజాం ఎస్‌ఐ సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కృష్ణ చివరి కోరిక మేరకు రాజాంలోని జర్నలిస్టులు కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామ పెద్దలు, కొంతమంది కుటుంబ సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ భార్య, కుమార్తెకు భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం అందిస్తామని జర్నలిస్టులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టు వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక ఒడిదుడుకుల మధ్య విషాదకరంగా మృతిచెందడం తోటి జర్నలిస్టులను, ఆయన స్నేహితులను తీవ్రంగా కలచివేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us