
కడపలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెలవులలో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈతకు వెళ్ళి ఐదుగురు బాలురు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి గుంటలో ఇరుక్కుని బయటకు రాలేక ఊపిరి ఆడక నానా యాతన పడి ఊపిరి వదిలారు. అందరు కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కుని ప్రాణాలు వదిలారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. గ్రామంలో వెతుకుతుండగా పిల్లల బట్టలు, చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి. దీంతో గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు పిల్లల ఆనవాళ్ళు తెలియలేదు. రాత్రి అయినా పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లు ఆపకుండా వెతకడంతో పిల్లలంతా ఒకే చోట విగత జీవులై కనిపించారు. వీరంతా అక్క, చెల్లెలు, అన్న పిల్లలుగా గుర్తించారు. చనిపోయిన బాలురంతా 15 సంవత్సరాలలోపు వారే కావడంతో విశేషం. ఇందులో ఆళ్ళగడ్డకు చెందిన చరణ్, పార్దు ఇద్దరూ అన్నదమ్ములు ఒకే తల్లి పిలలు. వీరిద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం మరింత శోకసంద్రంలో మునిగిపోయింది.
హర్ష జమ్మలమడుగుకు చెందిన బాలుడు కాగా, దీక్షిత్ మల్లెపల్లికి చెందిన బాలుడు, తరుణ్ అదే మండలంలోని నల్లారు కొట్టాలకు చెందిన బాలుడు. మల్లెపల్లి చెరువులో మట్టి కోసం తవ్విన గుంతలోనే వీరి మృతదేహాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల తవ్విన గుంత లోతు ఎంతో తెలియక ఈతకు వెళ్లిన ఈ ఐదుగురు బాలురు చనిపోయి ఉంటారని స్థానికులు అంటున్నారు. ఆనందంగా ఆహ్లాదంగా గడపాల్సిన పిల్లలు ఈతకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..