Andhra Pradesh: ఫేస్బుక్లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో దారుణం..
సోషల్ మీడియా స్నేహాలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తున్నాయో నిరూపించే మరో హృదయవిదారక ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వ్యాపార భాగస్వామ్యం పేరుతో దగ్గరై, ఆశ్రయం ఇచ్చిన మిత్రుడి భార్యపైనే కన్నేసిన ఓ యువకుడు.. తన కోరిక తీరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సోషల్ మీడియా పరిచయాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన స్నేహం కాస్తా వ్యామోహంగా మారి, చివరకు ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన కంచుపాటి అశోక్ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి, చెన్నైలో రెస్టారెంట్ నడుపుతున్నానని చెప్పుకునేవాడు. ఈ క్రమంలోనే పత్తికొండకు చెందిన సాయికుమార్, దుర్గాభవాని దంపతులతో ఫేస్బుక్ ద్వారా స్నేహం కుదిరింది. కర్నూలులో కొత్తగా హోటల్ పెడదామని, అందులో భాగస్వాములు కావాలని నమ్మబలకడంతో ఆ దంపతులు అతనికి ఆశ్రయం కల్పించారు.
మాలధారణలో ఉండి కూడా..
పది రోజుల క్రితం పత్తికొండకు వచ్చిన అశోక్, ఆ దంపతుల సహకారంతో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. విశేషమేమిటంటే.. అశోక్ ఇటీవలే ఆంజనేయస్వామి మాల ధరించాడు. అతనికి అవసరమైన భోజన వసతిని కూడా ఆ దంపతులే చూసుకునేవారు. అయితే తనపై నమ్మకం ఉంచిన స్నేహితుడి భార్యపైనే అశోక్ కన్నేశాడు. తనతో వచ్చేయాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. “నాకు వివాహమైంది.. భర్తను వదిలి రాను” అని ఆ మహిళ ఖచ్చితంగా చెప్పడంతో అశోక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఫోన్ చేసి.. “నేను చనిపోతున్నాను” అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆందోళన చెందిన మహిళ తన భర్తకు విషయం చెప్పడంతో వారు వెంటనే అశోక్ ఇంటికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టారు. అప్పటికే అశోక్ ఉరేసుకుని వేలాడుతుండటంతో కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూనే అశోక్ ప్రాణాలు విడిచాడు.
అపరిచితులతో ఫేస్బుక్ స్నేహాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. వ్యాపార భాగస్వామ్యం పేరుతో దగ్గరై, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగింది. ఆశ్రయం ఇచ్చి, భోజనం పెట్టిన చేతులనే కాటు వేయాలని చూడటం అశోక్ మానసిక స్థితిని తెలియజేస్తోంది. పత్తికొండ సీఐ జయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఫోన్ ఆధారంగా నెల్లూరులోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
