AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming: కాకర సాగుతో లాభాల పంట.. ఈ రైతు టెక్నిక్ ఏంటి అంటే..?

ఏలూరు జిల్లా రైతు అంగిన కృష్ణమూర్తి శాశ్వత పందిరిపై కాకర సాగుతో అధిక లాభాలు గడిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, అధునాతన ఎరువులు, కీటక నియంత్రణ వంటి శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ ఎకరంన్నర విస్తీర్ణంలో ఏడాదికి రూ. 3 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Farming: కాకర సాగుతో లాభాల పంట.. ఈ రైతు టెక్నిక్ ఏంటి అంటే..?
Bitter Gourd Farming
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2026 | 11:07 AM

Share

వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు మూస పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, తక్కువ భూమిలో అధిక దిగుబడులు ఇచ్చే పంటలను ఎంచుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన రైతు అంగిన కృష్ణమూర్తి పదేళ్లుగా కూరగాయల సాగులో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం శాశ్వత పందిరిపై కాకర సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

పది సంవత్సరాల అనుభవం, ఆధునిక సాగు విధానం:

కృష్ణమూర్తి గత పదేళ్లుగా కాకర, బీర, టమాటా, దొండ వంటి కూరగాయలను సాగు చేస్తూ వస్తున్నారు. తనకున్న అనుభవంతో, సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను జోడించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఎకరన్నర విస్తీర్ణంలో శాశ్వత పందిరిపై కాకర సాగును చేపట్టారు. ఈ శాశ్వత పందిరి సుమారు పదేళ్ల క్రితం వేసినదే కావడం విశేషం.

సాగు విధానం, జాగ్రత్తలు:

కృష్ణమూర్తి ప్రగతి, ఈస్ట్ వెస్ట్ రకాల కాకర విత్తనాలను ఉపయోగిస్తున్నారు. సాగు ప్రక్రియకు ముందు పందిరి వేసుకుని, దుక్కి దున్ని, గొట్లు ఎక్కించి, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మల్చింగ్ షీట్‌ను పరుస్తారు. ఆరు అడుగుల దూరంలో రెండు విత్తనాలను పెట్టుకుంటారు. వారం నుంచి పదిహేను రోజుల్లో మొలక వచ్చి, ఇరవై రోజుల నుంచి పై మందులు, నేల మందులు ఇవ్వడం ప్రారంభిస్తారు. మొదటి నెల రోజుల వరకు 3-19-19 ఎరువులను, ఆపై 13-0-45, అమ్మోనియా, 28-28 వంటి ఎరువులను వినియోగిస్తారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు ఎరువుల వినియోగాన్ని సమర్థవంతంగా చేపడుతున్నారు.

తెగుళ్ల నివారణా చర్యలు:

కాకర పంటకు తెగుళ్ల బెడద సహజం. వాటి నియంత్రణకు కృష్ణమూర్తి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. ముడత, పురుగు, పేను సమస్యలకు వారానికి ఒకసారి పై మందులను తప్పనిసరిగా పిచికారీ చేస్తారు. దోమకు ఫ్రైడ్, పేనుకు రుద్రా లేదా పాసింగ్ వంటి మందులు, పండు ఈగకు అక్టార్ ఉపయోగించి నియంత్రిస్తారు. ఫంగస్ తెగులు, పండు తెగులు రాకుండా ఆకు పండు చూసుకొని దానికి తగ్గ మందులను వాడతారు. కాయ పడ్డాక మందుల డోసేజ్ కొద్దిగా పెంచుతారు. ఈ శాస్త్రీయ పద్ధతుల కారణంగా పంట నాణ్యత బాగా పెరుగుతుంది.

దిగుబడి, ఆదాయం, మార్కెటింగ్:

కాకర పంట రెండు నెలలకు కాపుకు వస్తుంది. రెండు నెలల నుంచి మూడు నెలల పాటు దిగుబడినిస్తుంది. రోజు విడిచి రోజు నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల వరకు కాకరకాయలను కోస్తారు. కోసిన కాయలను జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం వంటి స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. ఎకరానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని, కాయ ధర రూ. 200-250 మధ్య ఉంటే ఎకరానికి రూ. 4 లక్షల వరకు ఆదాయం వచ్చి, రూ. 3 లక్షలు నికర లాభం మిగులుతుందని కృష్ణమూర్తి తెలిపారు. ఈ వ్యవసాయానికి కూలీలతో పెద్దగా పని ఉండదు, ఆయనతో పాటు ఒక మనిషి ఉంటే సరిపోతుందని చెబుతారు.

ప్రభుత్వ సబ్సిడీ, రైతులకు సలహా:

కాకర పందిరి సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తోంది. మొదటి సంవత్సరం పందిరి వేయడానికి ఎకరానికి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, ఎకరానికి లక్ష రూపాయల సబ్సిడీ లభిస్తుంది. దీని కోసం పాస్ బుక్, రైతు బ్యాంకు పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటివి సమర్పించాలి. మొక్కజొన్న, వరి వంటి సంప్రదాయ పంటల స్థానంలో, తక్కువ ఖర్చుతో, మంచి మిగులుబాటునిచ్చే కాకర వంటి కూరగాయల సాగును శాస్త్రీయ పద్ధతులతో చేపడితే రైతులు తప్పకుండా అధిక ఆదాయాన్ని పొందగలరని కృష్ణమూర్తి ఇతర రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చి శాస్త్రీయ సాగు విధానాలు చేపడితే ఆదాయం తప్పకుండా పెరుగుతుందని ఆయన నిరూపిస్తున్నారు.

Follow Us