Tirupati: తిరుపతిలో డ్రగ్స్ కలకలం.. మత్తు ముఠాలో టీటీడీ ఉద్యోగి.. బెంగళూరు లింకులు..

తిరుపతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను రేణిగుంట పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న జరిగిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 3 లక్షల విలువైన 63 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో టీటీడీ ఉద్యోగి ఉండటంతో పోలీసులు కేసును మరింత సీరియస్‌గా విచారిస్తున్నారు.

Tirupati: తిరుపతిలో డ్రగ్స్ కలకలం.. మత్తు ముఠాలో టీటీడీ ఉద్యోగి.. బెంగళూరు లింకులు..
Ttd Junior Assistant In Drug Case

Edited By:

Updated on: Jul 13, 2026 | 10:06 PM

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి జిల్లాలో డ్రగ్స్ ముఠా కలకలం రేపుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఒకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా మార్చింది. ఈ ఘటన స్థానిక టీటీడీ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 10న తిరుపతి సమీపంలోని రేణిగుంట పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 63 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ బరువు తూచడానికి నిందితులు వాడుతున్న ఒక డిజిటల్ వేయింగ్ మిషన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

బెంగళూరు లింకులు.. చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయం

పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుణశేఖర్ అని పోలీసులు నిర్ధారించారు. ఇతడు కర్ణాటక రాజధాని బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి తిరుపతిలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గుణశేఖర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్న అశ్విన్ కుమార్ సహాయంతో బెంగుళూరు నుండి తెచ్చిన డ్రగ్స్ ను చిన్న చిన్న ప్యాకెట్స్‌గా ప్యాక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో ఈ మత్తు పదార్థాన్ని ఒక్కో గ్రాముకు రూ. 3500 చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్..

ఈ ముఠా ప్రధానంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం ఏమిటంటే.. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ అనే టీటీడీ ఉద్యోగి అరెస్ట్ కావడం. ప్రధాన నిందితుడు గుణశేఖర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మత్తుకు బానిసగా మారిన రాహుల్ యాదవ్‌కి, ఈ ముఠాతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇతడు కేవలం డ్రగ్స్ వాడుతున్నాడా లేక సరఫరాలోనూ భాగస్వామిగా ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

అరెస్ట్ అయిన వారిలో టీటీడీ ఉద్యోగితో పాటు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఉండటంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎవరెవరు దీనికి బానిసలయ్యారు అనే పూర్తి వివరాలను సేకరించే పనిలో రేణిగుంట పోలీసులు బిజీగా ఉన్నారు.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడటం, అందులోనూ ఆలయ ఉద్యోగికి లింకులు ఉండటం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది.

Follow Us