
తిరుపతి, డిసెంబర్ 5: మూడేళ్ల పిల్లాడికి వారం రోజులుగా తరచూ దగ్గూ, ఆయాసం రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. అయినా పిల్లాడికి ఎంతకూ ఆయాసం తగ్గడం లేదు. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపరితిత్తులకు స్కాన్ చేయగా.. అందులో కనిపించింది చూసి స్టన్ అయ్యారు. ఇంతకీ స్కాన్ రిపోర్టులో ఏం వచ్చిందంటే..
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు పాలెం మహి (3) ఉన్నాడు. అయితే మహి వారం రోజుల కిందట ఆడుకుంటూ ప్లాస్టిక్ మూతను మింగేశాడు. దీంతో ఒక్కసారిగా పిల్లాడికి దగ్గు, ఆయాసం వచ్చింది. ఉన్నట్లుండి పిల్లాడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు సమీపంలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు సీటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తుల్లో మూత ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.
వెంటనే బ్రాంకోస్కోపీ ఆపరేషన్ చేయాలని ప్రశాంత్కు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీన పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో డాక్టర్ ఏబీ జగదీష్ ఆధ్వర్యంలోని టీం ఆపరేషన్ నిర్వహించి ఊపిరితిత్తుల్లోని మూతను విజయవంతంగా తొలగించారు. దీంతో బాలుడికి ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో పూర్తిగా కొలుకున్న బాలుడు మహిని గురువారం (డిసెంబర్ 4) డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కాగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో 24/7 పెద్దలు అలర్ట్గా ఉండాలి. లేదంటే తెలిసీ తెలియక వారు ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. తాజా ఘటనలో బాలుడు ప్లాస్టిక్ మూత మింగడం ఇంట్లో పెద్దవాళ్లు గమనించి ఉంటే ఇంతటి అనర్ధం జరిగేదికాదు. రుయా చిన్నపిల్లల విభాగం వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించి బయటకు తీయడంతో బాలుడికి ప్రమాదం తప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.