
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు నోటీసులు పంపిన మాజీ సీఐపై సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్య కింద సర్వీసు నుంచి తొలగిస్తూ కీలక ఉత్వర్వులు జారీ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు.
పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వు్లు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్లో ఉన్నారు.
అసెంబ్లీలో వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని వివరిస్తూ.. సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి సీఐ శంకరయ్య పేరును ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపివేశారని ఆరోపించారు చంద్రబాబు. ఘటనా స్థలంలోని శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని చంద్రబాబు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆరోపణలను తోసిపుచ్చిన శంకరయ్య.. చంద్రబాబు తన తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపించారు.
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 29 ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తున్నానని.. 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..